స్వలింగ సంపర్కం

1 Jul, 2019 12:04 IST|Sakshi

స్నేహితురాలితో వివాహిత పరార్‌

సాక్షి, చెన్నై: స్వలింగసంపర్కానికి అలవాటు పడ్డ ఓ యువతి పెళ్లయిన వారం రోజుల్లో భర్తను వదలి పెట్టి స్నేహితురాలితో ఉడాయించింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌కు చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ ఉద్యోగితో వారం రోజుల క్రితం వివాహమైంది. రెండు రోజుల క్రితం ఆ యువతి హఠాత్తుగా అదృశ్యమైంది. దీంతో భర్తపై అనుమానాలు మొదలయ్యాయి. ఆ యువతి తల్లిదండ్రులతో పాటు, భర్త కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త వద్ద జరిపిన విచారణలో పెళ్‌లైన నాటి నుంచి తనను దగ్గరకు రానివ్వలేదని, అయిష్టంగా తనతో మాట్లాడేదని పోలీసులకు ఆ భర్త వివరించాడు.

దీంతో ఏదేని ప్రేమ వ్యవహారం కారణం ఉండవచ్చని భావించారు. అయితే, ఆ యువతి స్నేహితుల వద్ద జరిపిన విచారణ కేసును మలుపు తిప్పింది. తిరునల్వేలి జిల్లా పనకుడికి చెందిన స్నేహితురాలితో ఆ యువతి అత్యంత సన్నిహితంగా ఉండేదని, ఆ ఇద్దరు హాస్టల్‌లో ఉన్నప్పుడు స్వలింగ సంపర్కానికి అలవాటు పడి, అందరి కంట పడ్డారని ఆ స్నేహితులు ఇచ్చిన సమాచారంతో విచారణను వేగవంతం చేశారు. పనకుడిలో విచారణ జరపగా, అక్కడున్న ఆ స్నేహితురాలు కూడా అదృశ్యం కావడంతో ఆ ఇద్దరు పరారైనట్టుగా పోలీసులు నిర్ధారించారు. తిరునల్వేలి నుంచి అదృశ్యమైన రోజున చెన్నైకు రైలులో ఆ ఇద్దరు బయలు దేరినట్టు గుర్తించారు. దీంతో చెన్నైలో వారు ఎక్కడున్నారో ఇక్కడి పోలీసుల సాయంతో నాగర్‌కోయిల్‌ పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు