వివాహిత అనుమానాస్పద మృతి

18 Apr, 2019 12:45 IST|Sakshi
గోవిందమ్మ మృతదేహం

ప్రకాశం, మార్టూరు: మండల కేంద్రమైన మార్టూరులో ఓ వివాహిత మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక యాదవ బజారుకు చెందిన పెనుబోయిన శ్రీను, గోవిందమ్మ భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తెకు వివాహం జరిపించారు. వీరు  వ్యవసాయం, గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్నారు.

మంగళవారం రాత్రి పిల్లలతో కలిసి నిద్రపోయిన గోవిందమ్మ (45)  ఉదయం స్థానికులు గమనించేసరికి ఇంటి పక్కన ఉన్న షెడ్డులో తాడుతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. స్థానికులు కిందకు దించి పరిశీలించగా ఆమె అప్పటికే మరణించినట్లు గమనించారు. మూడు రోజుల క్రితం గొర్రెలు మేపడానికి వెళ్లిన గోవిందమ్మ భర్త శ్రీనును స్థానికులు పిలిపించి పోలీసులకు సమాచారం అందించారు. తమ మధ్య గొడవలు ఏమీలేవని కొంతమేరకు ఆర్థిక ఇబ్బందులతో పాటు గత కొంతకాలం నుంచి గోవిందమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు శ్రీను చెప్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు గోవిందమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు