మహబూబాబాద్‌లో భారీ చోరీ

19 May, 2018 02:07 IST|Sakshi

పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో 45.5 తులాల నగల అపహరణ

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. 45.5 తులాల బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం, టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో నివసిస్తున్న జడల లక్ష్మీరేణుక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు ఎంపీపీఎస్‌లో క్లర్క్‌గా పనిచేస్తోంది.

తన అన్న అనారోగ్యంగా ఉండటంతో పరామర్శించేందుకు గురువారం సాయంత్రం ఇంటికి తాళంవేసి వరంగల్‌ వెళ్లింది. రాత్రి కావడంతో అక్కడే నిద్రించి శుక్రవారం ఉదయం మహబూబాబాద్‌కు తిరిగి వచ్చింది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తలుపులు పగులగొట్టి ఉన్నాయి. అందులోని 45.5 తులాల బంగారు నగలు, రూ.7వేల నగదు చోరీకి గురయ్యాయి.

మరిన్ని వార్తలు