సాక్షి, హైదరాబాద్: మక్కా మసీద్ బాంబు పేలుళ్ల కేసును కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. నిందితులపై నేరారోపణలు నిరూపించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు.. వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో 11 ఏళ్ల సుదీర్ఘ దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) 226 మంది సాక్ష్యులను విచారణ చేపట్టింది. ఛార్జీషీట్లో 10 మంది పేర్లను చేర్చగా.. వారిలో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కేవలం రెండే నిమిషాల్లో కోర్టు తుది తీర్పు ఇచ్చింది.
ఐదుగురు నిందితులు స్వామి అసిమానంద, భరత్, దేవెందర్ గుప్తా, రాజేందర్, లోకేశ్ శర్మలలో ఏ ఒక్కరిపైనా ఆరోపణలను ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయింది. దీంతో వారిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే మిగతా వారిపై మాత్రం ఛార్జీ షీట్ కొనసాగుతుందని కోర్టు(A-5.సునీల్ జోషి మృతి చెందారు) తెలిపింది. 2007 మే 18 తేదీన మధ్యాహ్నం మక్కా మసీద్లో ప్రార్ధన సమయంలో టిఫిన్ బాంబు ద్వారా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 9 మంది చనిపోయారు.
తర్వాత చెలరేగిన అల్లర్లను నియంత్రించే క్రమంలో పోలీసులు కాల్పులు జరపగా.. ఐదుగురు మృతి చెందారు. అల్లర్లలో 58 మందికి గాయాలయ్యాయి. ఇక మక్కా బ్లాస్ట్ కేసులో 10 మంది నిందితులను గుర్తించిన ఎన్ఐఏ.. ఐదుగురి పేర్లను మాత్రం చార్జీషీట్లో చేర్చింది. హిందూ దేవాలయాల్లో బాంబులు పేలుస్తున్నారన్న ఆరోపణలకు ప్రతీకారంగానే నిందితులు ఈ దాడులకు పాల్పడినట్లు ఎన్ఐఏ కోర్టుకి తెలిపింది. తీర్పు నేపథ్యంలో హైదరాబాద్లో అలర్ట్ ప్రకటించిన పోలీస్ శాఖ.. పాతబస్తీ, నాంపల్లి కోర్టు దగ్గర ప్రత్యేక బలగాలతో భారీ భద్రత కట్టుదిట్టం చేసింది.
ఎన్ఐఏ సమర్పించిన జాబితాలో నిందితులు పేర్లు...
A-1. దేవేందర్ గుప్తా
A-2.లోకేష్ శర్మ,
A-6.స్వామి ఆసిమానందా
A-7.భరత్ భాయ్
A-8.రాజేందర్ చౌదరి
పరారీలో ఉన్న వారు.
A-3.సందీప్ డాంగే
A-4.రామచంద్ర కళా సంగ్రా
A-10.అమిత్ చౌహన్.
ఈ కేసులో చనిపోయిన వ్యక్తి.
A-5.సునీల్ జోషి.
ఈ కేసులో బెయిల్ పై ఉన్న వాళ్లు
A-6 .స్వామి ఆసిమానందా
A-7.భరత్ భాయ్.
A-9.తేజ్ పరమార్