‘మక్కా’ పేలుడు కేసు కొట్టివేత

17 Apr, 2018 01:11 IST|Sakshi

నేర నిరూపణలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందన్న ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు.. ఐదుగురు నిందితులు నిర్దోషులుగా విడుదల

వారికి వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ లేదు

అసీమానంద వాంగ్మూలానికి చట్టబద్ధత లేదు

ఆ వాంగ్మూలం ఆధారంగానే పలువురిని నిందితులుగా చేర్చారు

64 మంది సాక్షులు తిరిగి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చారు

ప్రధాన దర్యాప్తు అధికారి వాంగ్మూలమూ పరస్పర విరుద్ధమే

సిమ్‌ కార్డుల విషయంలోనూ ఆధారాలు చూపలేదని స్పష్టీకరణ

కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు

నిందితుల్లో ఒకరి మృతి

ఇద్దరిపై కొనసాగుతున్న దర్యాప్తు.. ఆచూకీ లభించని మరో ఇద్దరు  

10 మంది కేసులో మొత్తం నిందితులు..

11 సంవత్సరాలు దర్యాప్తు, విచారణ కొనసాగిన కాలం

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా మసీదు బాంబు పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. నిందితులు నేరం చేసినట్టుగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని, ఏ ఒక్క అభియోగానికీ ఆధారాలు చూపలేకపోయిందని పేర్కొంది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న స్వామి అసీమానంద వాంగ్మూలానికి చట్టబద్ధత లేదని, చాలా మంది సాక్షులు తొలుత ఇచ్చిన సాక్ష్యానికి వ్యతిరేకంగా మళ్లీ సాక్ష్యం చెప్పారని స్పష్టం చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసు కుని కేసును కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ.. నాలుగో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి రవీందర్‌రెడ్డి తీర్పునిచ్చారు.

పదకొండేళ్ల తర్వాత.. 
హైదరాబాద్‌లోని చరిత్రాత్మక మక్కా మసీదులో 2007 మే 18న బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. మసీదులో మధ్యాహ్నం ప్రార్థనలు ముగిసిన తర్వాత 1:25 గంటల సమయంలో సెల్‌ఫోన్‌ సహాయంతో బాంబును పేల్చారు. ఆ ఘటనలో తొమ్మిది మంది మరణించగా.. 58 మంది గాయపడ్డారు. దీనిపై తొలుత స్థానిక పోలీసులు, అనంతరం సీబీఐ, ఎన్‌ఐఏలు దర్యాప్తు చేసి.. చార్జిషీట్లు దాఖలు చేశాయి. మొత్తంగా పది మందిని నిందితులుగా చేర్చాయి. సుదీర్ఘంగా 11 ఏళ్లపాటు దర్యాప్తు, విచారణలు కొనసాగాయి. తాజాగా సోమవారం తీర్పు వెలువడింది. 

అభియోగాలకు ఆధారాలేవీ? 
ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న వారు బాంబు పేలుళ్లకు పాల్పడినట్టు నిరూపించడంలో ఎన్‌ఐఏ విఫలమైందని న్యాయ మూర్తి రవీందర్‌రెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. నిందితులపై ఎన్‌ఐఏ మోపిన ఏ ఒక్క అభియోగానికి కూడా ఆధారాలు చూపలేకపోయిందని తెలిపారు. పేలుడుకు వాడిన సిమ్‌ కార్డులను నిందితులు ఉపయోగించారనేందుకు ఎటువంటి ఆధారాలు లేవన్నారు. అజ్మీర్‌ దర్గా పేలుడుకు, మక్కా మసీదు పేలుడుకు అవే సిమ్‌ కార్డులను ఉపయోగించారని ఎన్‌ఐఏ అభియోగం మోపిందని.. కానీ దీనిపై ఆధారాలను చూపలేకపోయిందని స్పష్టం చేశారు. బాబూలాల్‌ యాదవ్‌ పేరుతో దేవేందర్‌ గుప్తా సిమ్‌ కార్డులను కొనుగోలు చేశారనేందుకూ ఆధారాల్లేవన్నారు. 

ఆ వాంగ్మూలాలు చెల్లవు.. 
కేసులో కీలకంగా పేర్కొన్న స్వామి అసీమానంద నేరాంగీకార వాంగ్మూలానికి ఎటువంటి చట్టబద్ధత లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పోలీసు కస్టడీలో ఉండగా ఢిల్లీలోని పంచకుల కోర్టులో అసీమానంద వాంగ్మూలాన్ని నమోదు చేశారని.. కస్టడీలో ఉన్న వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం చట్ట ప్రకారం చెల్లదని వెల్లడించారు. దర్యాప్తు అధికారులు అసీమానంద వాంగ్మూలం ఆధారంగానే కొందరిని నిందితులుగా చేర్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక పేలుళ్లకు జరిపిన కుట్రలో భరత్‌ మోహన్‌లాల్‌కు సంబంధం ఉందని ఎన్‌ఐఏ నిరూపించలేక పోయిందని,. మిగతా కుట్రదారులకు డబ్బు ఇచ్చారనేందుకూ ఆధారాలు లేవని తెలిపారు. పేలుడుకు ముందురోజు రాజేంద్ర చౌదరి స్వయంగా మసీదుకు వెళ్లి బాంబు పెట్టారనేందుకు సైతం ఆధారాలు చూపలేకపోయిందన్నారు. ప్రధాన దర్యాప్తు అధికారి రాజా బాలాజీ ఇచ్చిన సాక్ష్యం కూడా పరస్పర విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 226 మంది సాక్షుల్లో 64 మంది తాము మొదట ఇచ్చిన సాక్ష్యానికి వ్యతిరేకంగా మళ్లీ సాక్ష్యం చెప్పారని వివరించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ.. ఈ కేసును కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. 

పది మంది నిందితులు.. 226 మంది సాక్షులు 
ఈ కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా చేర్చారు. తొలుత దర్యాప్తు చేసిన సీబీఐ.. హిందూ అతివాద గ్రూపు పేలుళ్లకు పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తించింది. 2010లో దేవేందర్‌ గుప్తా, లోకేశ్‌ శర్మలను అరెస్టు చేసింది. దేవేందర్‌ గుప్తా మొదటి నిందితుడిగా, లోకేశ్‌ శర్మను రెండో నిందితుడిగా చార్జిషీటు దాఖలు చేసింది. అనంతరం ఈ కేసు దర్యాప్తు ఎన్‌ఐఏ పరిధిలోకి వెళ్లింది. విస్తృతంగా దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ.. దేశవ్యాప్తంగా ఇదే తరహాలో జరిగిన దాడుల నుంచి సేకరించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుని.. మరికొందరు నిందితులను అరెస్టు చేసి, చార్జిషీట్లు దాఖలు చేసింది.

సందీప్‌ దంగే, రామచంద్ర కల్సాంగ్ర, సునీల్‌ జోషి, స్వామి అసీమానంద అలియాస్‌ నంబకుమార్‌ సర్కార్‌ అలియాస్‌ ఓంకారానంద్‌ అలియాస్‌ రాందాస్, భరత్‌ మోహన్‌లాల్‌ రాఠేశ్వర్‌ అలియాస్‌ భరత్‌ భాయ్,  రాజేంద్ర చౌదరి, తేజ్‌రామ్‌ పర్మార్, అమిత్‌ చౌహాన్‌లను తదుపరి నిందితులుగా చేర్చింది. ఇందులో ఐదుగురిపైనే అభియోగాలను నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారక్‌ సునీల్‌ జోషి.. కేసు దర్యాప్తు సమయంలోనే హత్యకు గురికాగా.. సందీప్‌ దంగే, రామచంద్ర కల్సంగ్రల ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. మరో ఇద్దరు నిందితులు తేజ్‌రామ్‌ పర్మార్, అమిత్‌ చౌహాన్‌లపై దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తంగా నిందితుల నేరాన్ని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్‌ మొత్తం 226 మంది సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించింది. 396 ఎగ్జిబిట్లు, 28 మెటీరియల్‌ ఆబ్జెక్ట్స్‌ను కోర్టు ముందుంచింది. 

పేలని బాంబు ఇచ్చిన ఆధారంతో.. 
మక్కా మసీదులో బాంబు పేలుడు అనంతరం క్లూస్‌ టీం తనిఖీలు చేస్తుండగా.. పేలకుండా ఉన్న మరో బాంబు లభించింది. దానిని నిర్వీర్యం చేసిన క్లూస్‌ టీం బృందం.. అందులో టైమర్‌గా సిమ్‌కార్డులను వినియోగించినట్టు గుర్తించింది. అంటే తొలి బాంబును కూడా అలా సిమ్‌ ఆధారంగానే పేల్చినట్టు నిర్ధారించారు. అటు రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గా పేలుళ్లలోనూ అచ్చు ఇదే తరహాలో సిమ్‌ ఆధారంగా బాంబులు అమర్చినట్టు గుర్తించారు. దాంతో దర్యాప్తు అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేసి.. నిందితులను అరెస్టు చేశారు. 

భారీగా బందోబస్తు.. 
మక్కా పేలుడు కేసు తీర్పు సందర్భంగా నాంపల్లి కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. తీర్పునిచ్చిన జడ్జి రవీందర్‌రెడ్డి చాంబర్‌ వద్ద కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆయన ఇంటికి తిరిగి వెళ్లేంత వరకు కూడా బందోబస్తు కొనసాగింది. 

నిందితులపై అభియోగాలివే.. 
దేవేందర్‌ గుప్తా: బాంబు పేలుళ్లకు మిగతా నిందితులతో కలసి కుట్ర పన్నాడు. మనోజ్‌కుమార్‌ పేరుతో తప్పుడు స్కూల్‌ సర్టిఫికెట్, బాబూలాల్‌ యాదవ్‌ పేరుతో తప్పుడు రేషన్‌కార్డు తయారు చేశాడు. ఈ తప్పుడు రేషన్‌కార్డుతో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాడు. దీని ఆధారంగా సిమ్‌ కార్డు తీసుకున్నాడు. ఈ ఫోన్‌ నంబర్‌ ద్వారానే మిగతా నిందితులతో మాట్లాడాడు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు ఇవ్వడంలో దిట్ట. మొబైల్‌ ఫోన్‌ను ఉపయోగించి అజ్మీర్‌ దర్గా వద్ద ఎలా పేలుడు జరిపారో.. అదే తరహాలో మక్కా మసీదు వద్ద పేలుళ్లు జరిపారు. 

లోకేశ్‌ శర్మ: మొబైల్‌ ఫోన్లు సంపాదించి పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. మక్కా మసీదు పేలుళ్లు ఎలా జరపాలన్న స్కెచ్‌ రూపొందించింది ఇతనే. 

స్వామి అసీమానంద: హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా.. మక్కా మసీదు, అజ్మీర్‌ దర్గాలలో పేలుళ్లు జరపాలని ప్రతిపాదించాడు. తన పథకాన్ని వివరించి రామచంద్ర కల్సాంగ్ర, భరత్‌ మోహన్‌లాల్‌ రాఠేశ్వర్‌ల ద్వారా సిమ్‌ కార్డులు సంపాదించాడు. పేలుళ్ల తరువాత స్వామి ఓంకారానంద్‌గా మారుపేరుతో హరిద్వార్‌ సమీపంలోని ఆత్మాల్‌పూర్‌ బొంగ్లా గ్రామంలో దాక్కున్నాడు. పోలీసులు అసీమానందను అరెస్ట్‌ చేసి.. హరిద్వార్‌ చిరునామాతో ఉన్న ఓటర్, రేషన్‌ కార్డులను, నాబాకుమార్‌ సర్కార్‌ పేరుతో ఉన్న పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. 

భరత్‌ మోహన్‌లాల్‌ రాఠేశ్వర్‌: పేలుడు కుట్రకు సంబంధించి కీలక పాత్ర పోషించాడు. గుజరాత్‌లోని మహదేవ్‌నగర్‌లో ఉన్న భరత్‌ ఇంట్లోనే అందరూ భేటీ అయి పేలుడుకు ప్రణాళిక రూపొందించారు. అక్కడే పేలుళ్ల కోసం రామచంద్ర కల్సాంగ్రకు రూ.40 వేలు ఇచ్చారు. సునీల్‌ జోషికి రూ.25 వేలు ఇచ్చి పిస్టళ్లు, సిమ్‌ కార్డులు పొందారు. 

రాజేంద్ర చౌదరి:  మక్కా మసీదులో బాంబు పెట్టిన ప్రధాన వ్యక్తి. 2007 ఏప్రిల్‌లో మరో వ్యక్తితో కలసి మక్కా మసీదు వద్ద రెక్కీ నిర్వహించాడు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ బాంబు పేలుడు, మాలేగావ్‌ పేలుళ్ల కేసుల్లోనూ రాజేంద్ర నిందితుడు.  

జడ్జి రవీందర్‌రెడ్డి రాజీనామా!

  • ఉదయం తీర్పు.. మధ్యాహ్నం రాజీనామా
  • బెదిరింపుల వల్లేనంటున్న నాంపల్లి కోర్టు వర్గాలు
  • రాజీనామాను ధ్రువీకరించని హైకోర్టు వర్గాలు  

సాక్షి, హైదరాబాద్‌: మక్కా మసీదు బాంబు పేలుడు కేసును కొట్టేస్తూ ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం జడ్జి రవీందర్‌రెడ్డి.. న్యాయాధికారి పోస్టుకు రాజీనామా చేసినట్లు తెలిసింది. ఉదయం 11.50 గంటలకు తీర్పునిచ్చిన ఆయన, మధ్యాహ్నం కల్లా రాజీనామా సమర్పించారు. తన రాజీనామా లేఖను హైకోర్టుకు పంపినట్లు నాంపల్లి కోర్టు వర్గాలు తెలిపాయి. అయితే రాజీనామా లేఖ విషయాన్ని హైకోర్టు వర్గాలు ధ్రువీకరించడం లేదు. ప్రస్తుతం రవీందర్‌రెడ్డి తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన రాజీనామాకు దారి తీసిన కారణాలు ఏంటన్నది నిర్దిష్టంగా తెలియడం లేదు. ఆయన వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు.

ఆయన్ను సంప్రదించేందుకు ‘సాక్షి’ యత్నించగా.. మాట్లాడేందుకు నిరాకరించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో రవీందర్‌రెడ్డి రాజీనామా వార్త బయటకు రావడంతో సర్వత్రా దీనిపైనే చర్చ జరిగింది. రాజీనామాపై ఎవరికి తోచిన కారణాలను వారు చెబుతున్నారు. తీర్పు అనంతరం బెదిరింపు కాల్స్‌ వచ్చాయని, అందువల్లే రాజీనామా చేశారని నాంపల్లి కోర్టు వర్గాలు చెబుతున్నాయి. న్యాయాధికారుల డిమాండ్ల పరిష్కారం, హైకోర్టు అనుసరిస్తున్న కంపల్సరీ రిటైర్‌మెంట్‌ విషయాల్లో ఇతర న్యాయాధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంతోనే ఆయన రాజీనామా చేశారని మరికొందరు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  
 

మరిన్ని వార్తలు