ఎర్రగుంట్లలో వ్యక్తి దారుణహత్య

27 Jan, 2019 09:04 IST|Sakshi
సుబ్బమ్మను విచారిస్తున్న సీఐ వెంకటరమణ మృతి చెందిన శ్రీనివాసరెడ్డి 

ఎర్రగుంట్ల : వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని వేంపల్లి రోడ్డులో శనివారం చోటుచేసుకుంది. పెసల శ్రీనివాసరెడ్డి(54) అనే వ్యక్తి గొంతుకు గుడ్డచుట్టి గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు...కమలాపురం మండలంలోని నల్లింగాయపల్లి శ్రీనివాసరెడ్డి సొంతూరు. పట్టణంలోని వేంపల్లి రోడ్డులోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ సమీపంలో శ్రీనివాసరెడ్డి నివసిస్తున్నారు. ఇతనికి తల్లిదండ్రులు లేరు. మద్యానికి అలవాడుపడిన శ్రీనివాసరెడ్డితో భార్య సుశీల ఐదేళ్ల క్రితం గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కోర్డులో విడాకుల కేసు నడుస్తోంది. కమలాపురం మండలం ఎర్రగుడిపాడుకు చెందిన సుబ్బమ్మ, శ్రీనివాసరెడ్డి ఇంటిలో పనిమనిషిగా చేస్తుంది.

రోజూ మాదిరిగానే శనివారం ఉదయం ఇంటిలో పనిచేయడానికి వచ్చింది. అప్పటికే ఇంటి గేటు తెరిచిఉండడంతో శ్రీనివాసరెడ్డిని పిలిచినా పలకలేదు. అయితే ఇంటిలోకి వెళ్లి చూడగా గొంతుకు టువాల్‌తో బిగించి ఉంది. అలాగే బీరువా తెరిచి ఉంది. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిఉన్నాయి. పనిమనిషి విషయాన్ని మద్యం తీసుకువచ్చే బ్రాందీషాపు కిరణ్‌కు ఫోన్‌ చేసి చెప్పింది. కిరణ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎర్రగుంట్ల సీఐలు వెంకటరమణ, కొండారెడ్డిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ సంఘటన స్థలంలో ఆదారాలు సేకరించారు. పనిమనిషి సుబ్బమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు