మతి స్థిమితం లేని బాలికపై అఘాయిత్యం

27 Mar, 2019 15:41 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సాయిబాబా

సాక్షి,మణుగూరుటౌన్‌: పట్టణంలోని మతి స్థిమితం లేని బాలిక(14)పై సోమవారం రాత్రి లైంగిక దాడి చేసిన ముగ్గురు నిందితులలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో మణుగూరు డీఎస్పీ ఆర్‌.సాయిబాబా తెలిపిన వివరాలు...బెలూన్లు కొనేందుకని పట్టణంలోని షాపు వద్దకు వెళ్లిన మతి స్థిమితం లేని బాలికను ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నారు. గాంధీనగర్‌ చర్చి  ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. ఆ బాలిక గట్టిగా అరవడంతో ఆ యువకులు పారిపోయారు. చుట్టుపక్కల వారు ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు.

హనుమాన్‌ టెంపుల్‌ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు బైక్‌పై ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. బాలికపై లైంగిక దాడి చేసింది తామేనని వారు ఒప్పుకున్నారు. వీరిని– అశోక్‌నగర్‌కు చెందిన డేగ యశ్వంత్, కరకగూడెం మండలం తురుములగూడెం గ్రామస్తుడు నిట్టా ప్రశాంత్‌గా పోలీసులు గుర్తించారు. మరో నిందితుడైన పినపాక మండలం టి.కొత్తగూడెం గ్రామస్తుడు సిద్ధి నరేష్‌ పరారీలో ఉన్నాడు. వీరు ముగ్గురూ గతంలో కూడా గాంధీనగర్‌కు చెందిన బాలికను కిడ్నాప్‌ చేసి వదిలేశారు. నరేష్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు