పిచ్చి అభిమానంతో...

23 Jun, 2018 09:18 IST|Sakshi
డీనూ అలెక్స్‌ (పాత చిత్రం)

సాక్షి, తిరువనంతపురం: అభిమానం శృతి మించి విచక్షణ కోల్పోతే.. అది విపరీత అనర్థాలకు దారితీస్తుంది. కేరళలో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఫిఫా వరల్డ్‌ కప్‌లో అర్జెంటీనా దారుణ ఓటమిని జీర్ణించుకోలేని ఓ వీరాభిమాని సూసైడ్‌ పాల్పడుతున్నట్లు లేఖ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. కంగారుపడిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, సెర్చ్‌ ఆపరేషన్‌తో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. 

కొట్టాయం జిల్లా అర్మనూర్‌ గ్రామానికి చెందిన 30 ఏళ్ల డీనూ అలెక్స్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. మెస్సీకి డీనూ వీరాభిమాని. గురువారం రాత్రి జరిగిన అర్జెంటీనా-క్రోయేషియా మ్యాచ్‌ను తిలకించాడు. మ్యాచ్‌లో 3-0 తేడాతో అర్జెంటీనా ఘోర పరాభవం చెందింది. దీంతో మనస్థాపం చెందిన డీనూ... ‌‘నా ఫెవరెట్‌ టీం ఓడింది. మెస్సీ దారుణంగా నిరుత్సాహపరిచాడు. నాకు ఈ ప్రపంచంలో చూసేందుకు ఇంకా ఏం మిగల్లేదు. చావటానికి వెళ్తున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదంటూ’ అంటూ మళయాళంలో ఓ లేఖ రాసి పెట్టి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం నుంచి తమ కుమారుడు కనిపించకుండా పోవటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డీనూ గదిలో అర్జెంటీనా జెర్సీ, పుస్తకాల్లో, గోడల మీద మెస్సీ ఫోటోలు, అభిమాన రాతలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో ఆ చుట్టుపక్కల గాలింపు చేట్టారు. అయితే వర్షాలతో సెర్చ్‌ ఆపరేషన్‌కు విఘాతం ఏర్పడుతోంది. బహుశా మీనాచిల్‌ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇండియాలో ఫిఫా ఫీవర్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కేరళ ముందు వరుసలో ఉంటుంది.

మరిన్ని వార్తలు