సరదా కోసం బైక్‌ల చోరీ

31 Aug, 2019 11:06 IST|Sakshi

మైనర్‌ దొంగ అరెస్ట్‌

రెండు బైక్‌లు స్వాధీనం

చిలకలగూడ : ద్విచక్ర వాహనాలను చోరీ చేసి వాటిపై చక్కర్లు కొడుతున్న ఓ బాలుడిని అరెస్ట్‌ చేసి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.  డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిలకలగూడ చింతబావికి చెందిన బాలుడు (16)చదుకు అర్ధాంతరంగా స్వస్తి చెప్పి జూలాయిగా తిరుగుతున్నాడు. అతడికి బైక్‌లపై తిరగడమంటే సరదా. అయితే బైక్‌ కొనే స్థోమత లేకపోవడంతో పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలించి జాయ్‌రైడింగ్‌ చేసేవాడు.

వాహనంలో పెట్రోలు ఎక్కడ అయిపోతే అక్కడే వాటిని వదిలేసేవాడు. ఠాణా పరిధిలో బైక్‌ల చోరీపై ఫిర్యాదులు అందడంతో డీఎస్‌ఐ శ్రీనివాస్‌ నేతృత్వంలో ప్రత్యేక  బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సదరు బాలుడి  కదలికలపై సమాచారం అందడంతో అతడిపై నిఘా పెట్టారు. శుక్రవారం ఉదయం సీతాఫల్‌మండి చౌరస్తా వద్ద  పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా దొంగిలించిన వాహనంపై అటుగా వచ్చిన మైనర్‌  వారిని చూసి  పరారయ్యేందుకు యత్నించాడు. దీనిని గుర్తించిన పోలీసులు అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వాహనాల చోరీకి పాల్పడుతున్నట్లు అంగీకరించాడు. అతడి నుంచి రెండు బైక్‌లపై స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఐ నర్సింహరాజు తెలిపారు.

మరిన్ని వార్తలు