రెండు కుటుంబాల్లో ప్రేమ విషాదం

23 Oct, 2019 07:49 IST|Sakshi
కాంచన

 ప్రేమ కోసం బాలిక ఆత్మహత్యాయత్నం

మనవరాలి దుస్థితి చూసి తాత కన్నుమూత

చికిత్స పొందుతూ బాలిక మృతి

మండ్య జిల్లాలో ఘటన  

ప్రియుని తండ్రి సైతం ఆత్మహత్యాయత్నం

కర్ణాటక, మండ్య : ప్రేమకథ రెండు కుటుంబాల్లో విషాదం నింపిన ఘటన జిల్లాలోని నాగమంగల తాలూకాలో మంగళవారం వెలుగు చూసింది. తాలూకాలోని మంచనహళ్లి గ్రామానికి చెందిన కాంచన (16) సమీపంలోని హొన్నెహళ్లి గ్రామానికి చెందిన యశ్వంత్‌ అనే యువకుడి మధ్య కొద్ది కాలం క్రితం ప్రేమ చిగురించింది. ఈ విషయం తల్లితండ్రులకు తెలియడంతో మనస్తాపం చెందిన  కాంచన ఈనెల 5వ తేదీన విషం తాగింది. దీంతో కడుపు నొప్పి తాళలేక ఉరేసుకోవడానికి యత్నించింది. ఇది గమనించిన కాంచన తల్లితండ్రులు వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్సకు స్పందించకపోవడంతో ఇంటికి తీసుకెళ్లాలంటూ వైద్యులు తల్లితండ్రులకు సూచించారు.

దీంతో దిక్కుతోచని తల్లితండ్రులు మరో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించసాగారు. అయితే తమ కుమార్తె ఆత్మహత్య యత్నానికి యశ్వంత్‌ కారణమంటూ కాంచన తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు యశ్వంత్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మంగళూరులో డ్రైవర్‌గా పని చేస్తున్న యశ్వంత్‌ తండ్రి సోమశేఖర్‌ ఈనెల 10వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మనవరాలిని చూడడానికి వచ్చిన కాంచన తాత చంద్రు (65) మనవరాలి పరిస్థితి చూసి గుండెపోటుతో ఆసుపత్రిలోనే కన్నుమూశాడు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంచన సైతం ఈనెల 20వ తేదీన చికిత్స ఫలించక మృతి చెందింది. ఇలా ఒక ప్రేమకథ రెండు కుటుంబాల్లోనూ విషాదం నింపింది. 

మరిన్ని వార్తలు