బాలిక మిస్సింగ్‌.. ఆందోళనలో తల్లి

13 Jun, 2019 17:44 IST|Sakshi
అదృశ్యమైన బాలిక నాగసాయి దుర్గ(16)(పాతచిత్రం)

విజయవాడ: నగరంలో ఓ మైనర్‌ బాలిక మిస్సింగ్‌ కలకలం రేపుతోంది. ఇంటి నుంచి బయటికెళ్లిన కూతురి ఆచూకీ తెలియకపోవడంతో ఆ తల్లి కలవరపాటుకు గురవుతోంది. కిడ్నాప్‌ చేసి బంధించారేమోనని భయాందోళన చెందుతోంది. వివరాలు.. స్థానికంగా ఉన్న భారతీనగర్‌లో తల్లిదండ్రులతో కలిసి నాగసాయి దుర్గ(16) నివాసముంటోంది. బెజవాడ మాచవరంలోని ఎస్‌ఆర్‌ఎస్‌ కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. వేసవి సెలవులు కావడంతో నాలుగు రోజుల క్రితం విజయవాడ రామలింగేశ్వర్‌నగర్‌లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. కాలేజీ రీఓపెన్‌ కావడంతో ఈరోజు(గురువారం) ఉదయం 7 గంటలకు అమ్మమ్మ ఇంటి నుంచి భారతీనగర్‌కు కాలినడకన బయలు దేరింది. ఆ తర్వాత అడ్రెస్‌ లేకుండా పోయింది.

భారతీనగర్‌లోని ఇంటికి చేరుకోవాలంటే కిలో మీటర్‌ వరకు నడిచి వచ్చి షేర్‌ ఆటోలో ఇంటికి బయలుదేరి రావాలి. ఐతే 9 గంటలు దాటినా సాయిదుర్గ ఇల్లు చేరలేదు. దీంతో తల్లిలో ఆందోళన మొదలైంది. తెలిసిన వాళ్ల దగ్గర వాకబు చేసినా ఫలితం లేకపోయింది. కచ్చితంగా తన బిడ్డను కిడ్నాప్‌ చేసి ఉంటారని తల్లి అనుమానిస్తోంది. ఈ మేరకు పడమట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా కేసు మిస్టరీని చేధిస్తామని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు