ఏపీ-టీఎస్‌: చిన్నారులపై వరుస అత్యాచారాలు

12 May, 2018 14:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చాక్లెట్లు కొనిపెడతానంటూ చిన్నారి పాపను తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడో వృద్ధుడు... బాలికను గర్భవతిని చేశాడు మరో ముసలోడు... నాలుగు నెలలుగా విద్యార్థినిపై అఘాయిత్యం జరుపుతూ పట్టుపబడ్డాడో ట్యూషన్‌ టీచర్‌! తెలుగు రాష్ట్రాల్లో ఒక్క శనివారం రోజే మధ్యాహ్నం వరకు రిపోర్ట్‌ అయిన కీచకపర్వాలివి. రాత్రికి వరకు ఇంకా ఎన్ని జరుగుతాయో, అసలు వెలుగులోకి రాకుండాపోయే ఘటనలెన్నో!!

దాచేపల్లిలో మరో దారుణం: గుంటూరు జిల్లా దాచేపల్లిలో మరో దారుణం వెలుగుచూసింది. 55 ఏళ్ల వృద్ధుడు కొద్దిరోజులుగా బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఇంట్లోవాళ్లకు చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించేవాడు. ఇటీవలే పాప ఆరోగ్యం దెబ్బతినడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యపరీక్షల్లో ఆమె గర్భవతని తేలింది. భయంతో వణికిపోయిన పాప.. తనపై జరిగిన అకృత్యాన్ని చెప్పేసింది. తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు నిందితుడు మహబూబ్‌వలీపై పోలీసులు కేసు నమోదుచేశారు.

చిన్నారిపై అఘాయిత్యం.. బియ్యం ఇచ్చే యత్నం: నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఐదేళ్ల చిన్నారిపై గురుస్వామి అనే వృద్ధుడు అత్యాచారానికి యత్నించాడు. చాక్లెట్లు, బిస్కెట్లు కొనిస్తానంటూ తీసుకెళ్లి అఘాయిత్యం జరుపబోగా.. చిన్నారి నానమ్మ గమనించింది. చేసినతప్పుకు ప్రతిగా ఐదు కేజీల బియ్యం ఇచ్చి తప్పించుకోవాలని చూశాడా కీచకుడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడు గురుస్వామిని అదుపులోకి తీసుకున్నారు.

మీర్‌పేట్‌లో విద్యార్థినిపై ట్యూటర్‌: హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోగల లెనిన్‌ నగర్‌లో దారుణం వెలుగుచూసింది. 12 ఏళ్ల విద్యార్థినిపై ఆమెకు పాఠాలు  చెప్పే ట్యూటర్‌ గోపి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తీవ్రరక్తస్రావం అవుతున్న స్థితిలో బాలికను తల్లిదండ్రులు గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ట్యూటర్‌ గోపి.. గడిచిన నాలుగు నెలలుగా బాలికపై అత్యాచారం జరుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

మరిన్ని వార్తలు