మైనర్‌ బాలిక ఆత్మహత్య

11 Aug, 2019 20:43 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : 9వ తరగతి బాలిక అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపింది. ఈ ఘటన వరంగల్ నగరంలో ఆదివారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. హన్మకొండకు చెందిన మైనర్ బాలిక తొమ్మిదవ తరగతి చదువుతోంది. గత కొద్ది రోజులుగా అదే ప్రాంతానికి చెందిన కొందరు యువకులు బాలికను తరుచూ ఇబ్బందిపెట్టేవారు. కొద్దిరోజుల క్రితం బాలికను లైంగిక వేధింపులకు గురి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన సదరు మైనర్ బాలిక సమ్మయ్య నగర్‌లోని ఇంట్లో ట్యాంక్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

కాగా శవ పరీక్షల అనంతరం బాలికపై అత్యాచారం జరిగింది లేనిది తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు. మైనర్ బాలికపై వేధింపులు పాల్పడిన ఇద్దరు యువకులను కేయూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు