-

బెజవాడలో తొట్టి గ్యాంగ్ గుట్టు రట్టు...

23 Aug, 2019 17:25 IST|Sakshi

వాహనాలు దగ్గం చేసిన కేసులో ముగ్గురు అరెస్ట్‌

సాక్షి, విజయవాడ: అర్ధరాత్రి వాహనాలను దగ్ధం చేసి జనం గుండెల్లో దడ పుట్టించిన తొట్టి గ్యాంగ్ గుట్టు రట్టయింది. సీసీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా ఉదంతం జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే పోలీసులు కేసు ఛేదించారు. ఇందుకు సంబంధించి .ముగ్గురిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. సత్యనారాయణపురంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు చోట్ల వాహనాలపై పెట్రోల్ పోసి దగ్ధం చేసిన చేసిన విషయం తెలిసిందే.

నిందితులను పోలీసులు శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీసీపీ విజయరావు మాట్లాడుతూ.. పార్క్ చేసి ఉన్న వాహనాలపై పెట్రోల్ పోసి దగ్ధం చేసిన కేసులో రాజరాజేశ్వరి పేటకు చెందిన సంజయ్‌తో పాటు మరో ఇద్దరు మైనర్లను అరెస్ట్ చేశామని తెలిపారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన గుమ్మడి సంజయ్‌కు చదువు అబ‍్బలేదు. అడిగేవారు లేకపోవటంతో చెడు దారి పట్టి వ్యసనాలకు బానిస అయ్యాడు. నిత్యం ఇద్దరు బాలురితో కలిసి మద్యం మత్తులో జోగి తప్పతాగి తిరిగే వాడు. 

అయితే మత్తులో ఉన్న కారణంగా వారు ఈ నేరానికి పాల్పడ్డారని డీసీపీ స్పష్టం చేశారు. తల్లిదండ్రుల నియంత్రణ లేకపోవటం వల్లే మద్యానికి బానిసలై నేర ప్రవృత్తి వైపు మళ్లారని డీసీపీ అన్నారు. విజయవాడలో నేరాల అదుపుకు పటిష్ట నిఘా ఏర్పాటు చేసామని ఈ సందర్బంగా పేర్కొన్నారు. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడినా, ఆకతాయి పనులు చేసినా కఠిన చర్యలు తప్పవని డీసీపీ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు