అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఆచూకీ లభ్యం

13 Dec, 2017 09:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ఇద్దరు బాలికలు, ఓ బాలుడి ఆచూకీ లభ్యమైంది. ముంబయి సమీపంలోని కళ్యాణ్ పట్టణంలో చిన్నారులను గుర్తించినట్లు బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు. అనుమానాస్పద స్థితిలో కనిపించిన చిన్నారులను ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసి వారిని అక్కున చేర్చుకుంది. స్వచ్ఛంద సంస్థ సిబ్బంది బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సహా చిన్నారుల కుటుంబ సభ్యులు కళ్యాణ్ బయల్దేరి వెళ్లినట్లు సమాచారం.

అసలు విషయం ఏంటంటే..
ఇంటి నుంచి వెళ్లిపోతున్నామంటూ ఇద్దరు బాలికలు, ఓ బాలుడు లేఖ రాసిపెట్టి అదృశ్యం కావడం నగరంలోని టోలీచౌకీలో కలకలం రేపింది. 'అమ్మా.. నాన్నా మీకు భారం కాము.. మీకు దూరంగా వెళ్లిపోతున్నాం.. అందరూ పిల్లల లాగే మేము ఉంటాం..' అంటూ ఈ ముగ్గురు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆపై ముంబయి వెళ్తున్నామంటూ ఫోన్ చేయడంతో కుటుంబసభ్యులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. టోలీచౌకీకి  చెందిన కైఫ్ సబెరి (11), అస్మా సబెరి (12), హాఫ్సా సబెరి (15)ల అదృశ్యంపై విచారణ చేపట్టిన క్రమంలోనే ముంబయి నుంచి ఫోన్ చేసిన ఓ స్వచ్ఛంద సంస్థ ఈ ముగ్గురి సమాచారం అందించింది. వారికి నగరానికి తీసుకొచ్చేందుకు పోలీసులు, చిన్నారుల కుటుంబసభ్యులు కళ్యాణ్‌కు వెళ్లారు.

మరిన్ని వార్తలు