భాష అర్థంకాక చితక్కొట్టేశారు

8 Apr, 2018 12:51 IST|Sakshi
ఉస్మానియాలో చికిత్స పొందుతున్న వోలెజ్‌, ఇన్‌సెట్లో వోలెజ్‌ తలకు గాయం

సాక్షి, కామారెడ్డి:  భాష అర్థం కాకపోవటంతో ఓ విదేశీయుడిపై కొందరు రైతులు దాడి చేసిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రష్యాకు చెందిన వీ వోలెజ్‌ (44) సైకిల్‌పై ప్రపంచయాత్రకు బయలుదేరాడు. దానిలో భాగంగా నిజామాబాద్‌ నుంచి షిర్డీకి వెళ్తున్నారు. శుక్రవారం సాయంత్రం బికనూర్‌కు చేరుకోగానే గాలివాన మొదలవడంతో వోలెజ్‌ తన ప్రయాణానికి విరామమిచ్చి సమీపంలోని పంటపొలాల్లో గుడారం ఏర్పాటు చేసుకున్నారు.

ఇంతలో పొలం యాజమాని మహేందర్‌ రెడ్డి అక్కడికి చేరుకుని.. అప్పటికే అతని పొలంలో టెంట్‌ వేసుకుని సేద తీరుతున్న వోలెజ్‌ని ప్రశ్నించాడు. అతను తన భాషలో సమాధానం చెప్పటం.. రైతుకు విదేశీయుడి మాటలు అర్థం కాకపోవటంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు భాష అర్థంకాని మహేందర్‌రెడ్డి.. వోలెజ్‌ని దొంగ అనుకొని అతనిపై దాడి చేశాడు. ఇంతలో మరికొందరు రైతులు కూడా మహేందర్‌రెడ్డికి తోడు కావటంతో వోలెజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వోలెజ్‌ను ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహేందర్‌ రెడ్డిపై కేసు నమోదు చేశారు. మహేందర్‌ రెడ్డితో వాగ్వాదం జరుగుతున్న సమయంలో వోలెజ్‌ గూగుల్‌ ట్రాన్స్‌లేటర్‌ సాయం తీసుకుందామని ప్రయత్నించాడనీ.. కానీ, అంతలోనే మహేందర్‌ రెడ్డి అతనిపై దాడి చేశాడని పోలీసులు పేర్కొన్నారు. బాధితుడి తల, దవడ, కుడి చేతికి గాయాలైనట్లు వైద్యులు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు