కుటుంబం జల సమాధి; ఆత్మహత్యా.. ప్రమాదమా!

18 Feb, 2020 21:11 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : అల్గునూర్‌ వద్ద కాకతీయ కాలువలో కుటుంబం జలసమాధి ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం వెలుగు చూసిన ఈ ఘటనలో బయటపడ్డ మృతదేహాలు పెద్దపల్లి శాసనసభ్యుడు దాసరి మనోహర్‌రెడ్డి సోదరి రాధ (50), ఆమె భర్త సత్యనారాయణరెడ్డి (55), వారి కుమార్తె వినయశ్రీ (21)గా గుర్తించిన సంగతి తెలిసిందే. సత్యనారాయణరెడ్డి కుటుంబం మృత్యువాత పడడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నా.. అది ప్రమాదమేనని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదవశాత్తు కారు కాలువలోకి దూసుకెళ్లిందని అంటున్నారు.
(చదవండి : కుటుంబం జలసమాధి..)

అనుమానాలివే..!
అల్గునూర్‌ కెనాల్లో పడ్డ కారు జనవరి 26న ఉదయం 11.06 నిముషాలకు రేణిగుంట టోల్ ప్లాజా వద్ద హైదరాబాద్‌కు వెళ్తున్నట్టు రికార్డయింది. అదే రోజు రాత్రి 8 గంటల 15 నిమిషాలకు కరీంనగర్ వైపు వస్తున్నట్లు సీసీ కెమెరాలో రికార్డయింది. ఇక 26న హైదరాబాద్‌కు వెళ్లొచ్చిన సత్యనారాయణ రెడ్డి కుటుంబం మరుసటిరోజు 27న సాయంత్రం కరీంనగర్ నుంచి కారులో ఎటు బయలుదేరారు అనేది అనుమానం. కూతురు వినయశ్రీ చదువు కోసం హైదరాబాద్‌లో 26న సత్యనారాయణరెడ్డి ఇల్లు చూసొచ్చినట్లయితే 27న సాయంత్రమే ఎందుకు బయలుదేరారు అనే అనుమానం వ్యక్తమవుతోంది.
(చదవండి : రాధిక కుటుంబం మృతిపై పలు అనుమానాలు..!)

టూర్‌కు వెళ్తున్నట్లు చెప్పి 27న సాయంత్రం కారులో బయలుదేరారని సత్యనారాయణరెడ్డి వద్ద పనిచేసే గుమస్తా నర్సింగ్ తెలిపారు. ఇంటి నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురయ్యారా? సాయంత్రం పూట ప్రమాదానికి గురైతే ఆ రూట్లో రద్దీగా ఉండే వాహనదారులు, జనం చూడలేదా అనేది అనుమానం. మూడు వారాలుగా వారు కనిపించకపోయినా, కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. పోలీసులు మాత్రం సాంకేతిక పరిజ్ఞానంతో అనుమానాలు నివృత్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.  

మరిన్ని వార్తలు