ఎమ్మెల్యే వాహనం ఢీకొని చిన్నారి మృతి

19 May, 2019 02:18 IST|Sakshi

ఏటూరునాగారం: ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రయాణిస్తున్న వాహనం ఢీకొని ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జీడివాగు పప్కాపురం క్రాస్‌ వద్ద శనివారం జరిగింది. మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి కల్యాణాన్ని తిలకించేందుకు ఎమ్మెల్యే సీతక్క గన్‌మెన్లు, పార్టీ నాయకులతో కలసి 3 వాహనాల్లో ములుగు నుంచి ఏటూరునాగారం మీదుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో జీడివాగు పప్కాపురం క్రాస్‌ వద్ద బైక్‌ను ఎమ్మెల్యే వాహనం ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న ఇర్ప స్రవంతి (3) తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందగా బాలిక తల్లి జయ, మేనమామ అరుణ్‌ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఏటూరునాగారం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే పీఏకు స్వల్ప గాయాలయ్యాయి.

వివాహానికి వెళ్తుండగా..  
వాజేడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన కుర్సం అరుణ్‌ గొత్తికోయగూడెంలో వివాహం ఉందని వచ్చాడు. ఇదే క్రమంలో గొత్తికోయగూడెం నుంచి చెల్లెలు జయ, మేనకోడలు స్రవంతితో కలసి బైక్‌పై పప్కాపురం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గొత్తికోయగూడెం నుంచి పప్కాపురం వెళ్లడానికి బైక్‌ను మళ్లిస్తుండగా వాహనం ఢీకొట్టిందని అరుణ్‌ తెలిపారు. కాగా,  ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సీతక్క ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు