హిందూ అమ్మాయితో ముస్లిం యువకుడు..

31 Jul, 2018 12:28 IST|Sakshi
షాపులను ధ్వంసం చేస్తున్న యువకులు

ఉత్తర ప్రదేశ్‌లో ఉద్రిక్తత

లక్నో: ఉత్తరప్రదేశ్‌, తెహ్రీ జిల్లా గన్సాలీలో సోమవారం హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఓ 18 ఏళ్ల ముస్లిం యువకుడు ఓ మైనర్‌ హిందూ బాలికతో హోటల్‌లో కనిపించడం ఉద్రిక్తతకు దారితీసింది. హిందూ సామాజిక వర్గానికి చెందిన కొందరు ఆ యువకుడిని చితక్కొట్టారు. చెప్పులు మెడలో వేసి ఉరేగించారు. అంతటితో ఆగకుండా మైనార్టీలకు సంబంధించిన షాప్‌లపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపు తప్పింది.

బిజ్‌నోర్‌ జిల్లాకు చెందిన ఆ యువకుడు సెలూన్‌ షాప్‌లో బార్బర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం స్థానికంగా ఉండే కొందరు యువకులు అమ్మాయితో సహా ఆ యువకున్ని హోటల్‌లో ఉండటాన్ని చూసి పట్టుకున్నారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చేలోపే అతనిపై దాడి చేశారు. పోలీసులు వారి నుంచి అతన్ని విడిపించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. యువకుడిపై కేసు నమోదు చేశామని,  ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని చట్టాన్నిచేతుల్లోకి తీసుకున్న ఎవరిని వదిలిపెట్టమని పోలీసులు మీడియాకు తెలిపారు. యువకునికి వైద్య పరీక్షలు నిర్వహించామని అతని గాయాలు అంత తీవ్రమైనవి కావని పేర్కొన్నారు. ఈ ఘటనలో 10 నుంచి 12 షాప్‌లు ధ్వంసమయ్యాయని, ఆ ప్రాంతాన్ని మొత్తం పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నట్లు సీనియర్‌ ఎస్సీ జోగిందర్‌ సింగ్ రావత్‌ తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సుప్రీం హెచ్చరించినా ఇలాంటి ఘటనలు ఆగడం లేదు.

>
మరిన్ని వార్తలు