దారుణం : కాలేజీలో యువకుడిపై పాశవిక దాడి..!

28 Jun, 2019 18:51 IST|Sakshi

సాక్షి, అనంతపురం : పట్టణంలోని ఆర్ట్ష్‌ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. కాలేజీ మైదానంలో ఓ యువకుడిపై కొందరు పోకిరీలు మూకుమ్మడి దాడి చేశారు. కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా చితకబాదారు. రక్తం కారుతున్నా కనికరించకుండా పాశవికంగా మెడభాగంలో కాళ్లతో తన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటికిరావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. బాధితున్ని కనికంటివారిపల్లెకు చెందిన శివయ్యగా గుర్తించారు. అనంతపురం డీఎస్పీ బాబు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితున్ని విచారించారు. ఆర్ట్ష్‌ కాలేజీలో చదువుతున్న తన మిత్రుడు రాజేష్‌తో తోటి విద్యార్థులు గొడవకు దిగుతున్నారని, అతను రమ్మనడంతో కాలేజీకి వెళ్లినట్టు శివయ్య చెప్పినట్టు సమాచారం. అయితే, ఇంతపెద్ద ఘర్షణ జరుతున్నా కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. 

మూడు రోజుల క్రితం ఘర్షణ..
అనంతపురం ఆర్ట్ష్‌ కాలేజీలో చదువుతున్న రాజేష్ జియో టవర్‌ వద్ద మెకానిక్‌గా పనిచేస్తున్న శివయ్య స్నేహితులు. మూడు రోజులక్రితం కాలేజీలోని ఓ వర్గంతో రాజేష్‌కు గొడవ జరిగింది. ఈ వ్యవహారంపై రాజేష్‌ శివయ్య సాయం కోరాడు. దీంతో అతను శుక్రవారం కాలేజీకి వెళ్లాడు. అయితే, అక్కడ రాజేష్‌ కనిపించలేదు. తిరిగి వస్తుండగా కొంతమంది పోకిరీలు అతనిపై మూకుమ్మడి దాడి చేశారు. స్టూడెంట్‌ కాకపోయినా శివయ్య కాలేజీకి ఎందుకు వెళ్లాడనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరేదైన కారణముందా అని విచారిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియనున్నాయి. దాడి జరిగిన సమయంలో శివయ్య మద్యం సేవించి ఉన్నట్టు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు