ఆటవిక చర్య.. నగ్నంగా మహిళ ఊరేగింపు

21 Aug, 2018 11:12 IST|Sakshi
మహిళపై దాడి చేస్తున్న గ్రామస్తులు

అర్రా : బిహార్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ యువకున్ని చంపిందనే నెపంతో కొందరు వ్యక్తులు ఓ మహిళపై దాడి చేశారు. అంతటితో ఆగక నగ్నంగా ఆమెను ఊరేగించారు. ఈ ఆటవిక ఘటన భోజ్‌పూర్‌ జిలాల్లోని బహియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం జరిగింది. వివరాలు.. దామోదర్‌పూర్‌కు చెందిన విమలేష్‌ సా సోమవారం నుంచి ఆచూకీ లేకుండా పోయాడు. ఓ రైల్వే స్టేషన్‌ సమీపంలో మంగళవారం ఉదయం అతని మృతదేహం లభించింది. విషయం తెలుసుకున్న మృతుని గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు.

విమలేష్‌ మృతికి దగ్గర్లో ఉన్న రెడ్‌లైట్‌ ఏరియాలో ఉండే మహిళలు కారణం కావొచ్చని ఆగ్రహించారు. అక్కడ నివాసముండే ఓ మహిళను ఇంట్లో నుంచి బయటకు లాగి ఆమెపై రాక్షసంగా దాడి చేశారు. వస్త్రాలు విప్పదీసి ఆమెను నగ్నంగా ఊరేగించారు. సమాచారం అందుకున్న ఎస్పీ అవకాశ్‌ కుమార్‌ అక్కడకు చేరుకుని గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు. భారీ స్థాయిలో పోలీసు బలగాల్ని దించి ఘర్షణలను అదుపు చేశారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు