ప్రాధేయపడినా కనికరించలేదు..

9 Jun, 2018 16:23 IST|Sakshi

గువాహటి, అసోం : పిల్లల్నిఎత్తుకుపోయేవాళ్లనే ఉద్దేశంతో ఇద్దరు వ్యక్తులను కొట్టి చంపిన దారుణ సంఘటన అసోంలోని కర్బిఅంగ్‌లాంగ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అభిజిత్‌ నాథ్‌, నిలుత్‌పాల్‌ దాస్‌లు పిక్నిక్‌ స్పాట్‌ కాంథే లంగ్‌షుకు బయల్దేరారు. పంజూరీ కచారీ అనే గ్రామం వద్దకు వెళ్లిన వీరిని పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగ్‌గా భావించిన గ్రామస్థుల గుంపు దాడి చేసింది.

వెదురు బొంగులు, కర్రలతో విపరీతంగా కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వేరే గ్రామానికి చెందిన కొందరు ఇద్దరు వ్యక్తులు నల్ల కారులో బాలుడిని ఎత్తుకుపోతున్నారని చెప్పడంతో పంజూరీ కచారీ గ్రామస్థులు వారిపై దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వదిలేయాలంటూ ఇరువురూ ప్రాధేయపడుతున్నా గ్రామస్థులు కనికరించలేదని చెప్పారు.

కిందపడిపోయి కదలిక ఆగిపోయేంత వరకూ వారిని చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. రక్తం కారుతున్న దేహాలతో వదిలేయాలంటూ వారిద్దరూ బ్రతిమలాడుతున్న వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేశారని వెల్లడించారు. ఈ ఘటనలో నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు