కాల్‌ డాటా ఆధారంగానే రవీంద్ర అరెస్టు: ఎస్పీ

4 Jul, 2020 12:47 IST|Sakshi
ఎస్పీ రవీంద్రబాబు

సాక్షి, విజయవాడ: రాజకీయ ఆధిపత్యపోరుతోనే వైఎస్సార్‌సీపీ నేత మోకా భాస్కర్‌రావును హత్య చేశారని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. 2013లో కూడా భాస్కర్‌రావు హత్యకు కుట్ర జరిగిందని అన్నారు. గడిచిన నాలుగు నెలలుగా భాస్కర్‌రావు హత్యకు పలుమార్లు ప్రయత్నించారని చెప్పారు. ఎస్పీ రవీంద్రబాబు శనివారం హత్యకేసు వివరాలను మీడియాకు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రధాన నిందితుడు నాంచారయ్యకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అండ ఉంది. హత్యా ఘటనకు 15 రోజుల ముందు రవీంద్రను నాంచారయ్య కలిశారు. ఒక రూమ్‌లో దాదాపు గంట సేపు వారిద్దరూ మాట్లాడుకున్నారు. భాస్కర్‌రావు హత్యకు ప్రయత్నిస్తున్నట్లు నాంచారయ్య రవీంద్రకు చెప్పారు. తన పేరు బయటకు రాకుండా ప్లాన్ చేయాలని రవీంద్ర స్పష్టం చేశారు. ఆ సమయంలో ఆయన పీఏ కూడా ఉన్నారు.
(చదవండి: టీడీపీ నేతల దౌర్జన్యం )

చేపల మార్కెట్‌కు భాస్కర్‌రావు ఒంటరిగా వస్తున్నారని గుర్తించి పథకం ప్రకారం హత్య చేశారు. నాలుగు రోజుల ముందు నుంచే హత్య ఎలా చేయాలో నిందితులకు ట్రైనింగ్ ఇచ్చారు. దాడి చేసిన తర్వాత ముందుగానే రెడీ చేసుకున్న బైక్‌లపై నిందితులు పరారయ్యారు. ప్రధాన నిందితుడు నాంచారయ్య ఇచ్చిన వాంగ్మూలంతో పాటు.. కాల్‌ డాటా ఆధారంగా విచారణ చేసిన తర్వాతే కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశాం. కొల్లు రవీంద్రకు నోటీసులు ఇవ్వడానికి వెళితే ఆయన పరారయ్యారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై తుని వద్ద  ఆయనను పట్టుకున్నారు’ అని ఎస్పీ రవీంద్రబాబు పేర్కొన్నారు.
(అన్న కోసమే.. మోకా హత్య ! )

మరిన్ని వార్తలు