మతిస్థిమితం లేని యువతిపై లైంగికదాడి, హత్య

7 Jan, 2020 11:52 IST|Sakshi
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌

చవటపాళెంలో దారుణం ఆలస్యంగా వెలుగులోకి..

వివరాలు తెలుసుకున్న ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌  

గూడూరురూరల్‌: మతిస్థిమితం లేని ఓ యువతిపై గుర్తుతెలియని దుండగులు లైంగికదాడికి పాల్పడి దారుణంగా హత్య చేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. రూరల్‌ పరిధిలోని దివిపాళెం పంచాయతీలో ఉన్న చవటపాళెంలో నిరుపయోగంగా ఉన్న ఇంట్లో యువతి మృతదేహం ఉందని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. వారి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గూడూరుకు చెందిన ఓ వ్యక్తి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి పర్వీన్‌ (28) అనే మతిస్థిమితం లేని చెల్లి ఉంది. తల్లిదండ్రులు లేకపోవడంతో యువతి అన్న, వదినల వద్దనే ఉంటుంది. అన్నకు ఇటీవల కాలు విరగడంతో మంచానికి పరిమితమయ్యాడు. ఆదివారం సాయంత్రం పర్వీన్‌ను సమీపంలో ఉన్న దుకాణానికి వెళ్లి దోశ పిండి ప్యాకెట్‌ తీసుకురావాలని చెప్పారు. ఆమె దుకాణానికి వెళ్లి ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఎక్కడా కనిపించలేదు. కాగా ఉదయం ఓ ఇంట్లో యువతి మృతదేహం ఉందని తెలుసుకున్న పోలీసులు విచారణ చేసి ఆమెను పర్వీన్‌గా గుర్తించారు. యువతి అన్నను పిలిపించి వివరాలు సేకరించారు.

తలపై కొట్టి..
పర్వీన్‌ను గుర్తుతెలియని దుండగులు నివాసం లేని ఇంట్లో బంధించారు. లైంగికదాడికి పాల్పడి, తలపై రాడ్‌తో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందిందని పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం సంఘటనా స్థలం ప్రాంతంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా తిరిగారని పోలీసులు తెలుసుకున్నారు. 

ఎస్పీ పరిశీలన
సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీమ్‌లను పిలిపించి ఆధారాలు సేకరించారు. ఎస్పీ మాట్లాడుతూ ఘటనపై కేసు నమోదు చేశామని, విచారణ జరుగుతోందన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. ఆయన వెంట రూరల్, పట్టణ సీఐలు రామకృష్ణారెడ్డి, దశరథరామారావు, రూరల్, చిల్లకూరు ఎస్సైలు పుల్లారావు, హుస్సేన్‌బాషా ఉన్నారు.

మరిన్ని వార్తలు