ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం 

13 Aug, 2019 03:41 IST|Sakshi

వికారాబాద్‌జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన  

పెద్దేముల్‌: ఓ కామాంధుడు ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఘటన వికారాబాద్‌ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పెద్దేముల్‌ మండలం రేగొండి గ్రామానికి చెందిన దంపతులు దినసరి కూలీలు. వీరికి ఐదేళ్ల కూతురు, కుమారుడు ఉన్నారు. బాలిక స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతోంది. ఈ నెల 9న వరలక్ష్మివ్రతం సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రానికి సెలవు ఉండటంతో తల్లిదండ్రులు బాలికను ఇంటివద్ద ఉంచి పనులకు వెళ్లారు. అనంతరం అదే గ్రామానికి చెందిన నగేష్‌(22) బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కూతురు అస్వస్థతగా ఉంది. జ్వరం వచ్చిందేమోనని మందులు వేశారు. తగ్గకపోవడంతో మరుసటి రోజు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఫలితం లేకపోవడంతో తల్లి ఆరా తీస్తే అత్యాచార విషయం చెప్పింది. బంధువుల వద్ద తలదాచుకున్న నిందితుడిని గ్రామానికి తెచ్చి సోమవారం పెద్దేముల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాండూరు డీఎస్పీ రామచంద్రుడు, సీఐ రవికుమార్‌ పెద్దేముల్‌ పోలీస్‌స్టేషన్‌ చేరుకొని చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. నగేష్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

మరిన్ని వార్తలు