యువతిపై లైంగిక దాడి

9 Mar, 2019 09:19 IST|Sakshi

విజయనగరం, కొమరాడ: మండలంలోని మాదలింగి గ్రామానికి చెందిన ఓ యువకుడు గుమ్మలక్ష్మీపురం మండలం వాడపుట్టి గ్రామానికి చెందిన ఓ మూగ యువతిని అత్యాచారం చేసినట్లు వాడపుట్టి గ్రామస్తులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి వాడపుట్టి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 5న రాత్రి కొమరాడ మండలం పాలేం గ్రామంలో శివరాత్రి సంబరాలు నిర్వహించడంతో పరిసర గ్రామస్తులతో పాటు వాడపుట్టి గ్రామానికి చెందిన పలువురు యువతీ యువకులు వెళ్లారు. సంబరాలు చూస్తుండగా వాడపుట్టి గ్రామానికి చెందిన మూగ యువతితో పాటు మరో ఇరువురు యువతులు ఆరుబయటకు వెళ్లడం గమనించిన ఓ యువకుడు వారి వెంటే వెళ్లి ఆ మూగ యువతిని బలవంతంగా పక్కన ఉన్న ప్రదేశానికి ఈడ్చుకెళ్లాడు.

దీన్ని గమనించిన  ఇద్దరు యువతులు పరుగున గ్రామానికి వచ్చి వాడపుట్టి గ్రామస్తులతో పాటు పాళెం గ్రామస్తులకు సమాచారం అందించడంతో సంఘటనా ప్రదేశానికి వెళ్లేసరికే ఆ యువకుడు పారిపోయాడు. ఆ ప్రదేశంలో గ్రామస్తులకు ఆ యువకుడి ఫోన్‌ లభించడంతో ఆ యువకుడు మాదలింగి గ్రామస్తుడుగా వారంతా గుర్తుపట్టారు. మొదట ఇరు కుటుంబాలకు చెందిన వారు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి రాజీ చేయాలనుకున్నప్పటికీ కుదరకపోవడంతో యువతి కుటుంబీకులు శుక్రవారం కొమరాడ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.  ఈ విషయంపై నిజనిర్ధారణ నిమిత్తం ఆ యువతిని వైద్య పరీక్షల నిమ్తితం పార్వతీపురంలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు. ఇదే విషయం ట్రైనీ ఎస్‌ఐ ప్రసన్నకుమార్‌ వద్ద ప్రస్తావించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.

అరెస్టు చేయాలి...
మండలంలోని పాలేం గ్రామంలో జరిగిన గుమ్మలక్ష్మీపురం మండలంల నెల్లికెక్కువ పంచాయతీ ఓటపుట్టి గ్రామానికి చెందిన మూగ యువతిపై అత్యాచారం చేసిన కేసులో మాదలింగి గ్రామానికి చెందిన బర్ల కామేశ్వరరావును తక్షణమే అరెస్టు చేయాలని సీపీఎం నాయకులు కొల్లి సాంబమూర్తి డిమాండ్‌ చేశారు.పార్వతీపురం సీఐ కార్యాలయం వద్ద మూగ యువతితో కలిసి ఆయన విలేకరులతో శుక్రవారం మాట్లాడారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేవారు. లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు