బాలికలపై లైంగిక వేధింపులు

31 Jan, 2019 11:37 IST|Sakshi
పోలీసుల అదుపులో ఉన్న వార్డెన్, వంట మనిషి , హాస్టల్‌కు సీల్‌ వేస్తున్న పోలీసులు

ప్రయివేటు హాస్టల్‌కు సీల్, యజమాని అరెస్ట్‌

తిరువణ్ణామలైలో ఘటన

చెన్నై  తిరువణ్ణామలై: తిరువణ్ణామలైలోని ప్రయివేటు హాస్టల్‌లో బాలికలకు లైంగిక వేధింపులు ఇచ్చిన యజమానిని పోలీసులు అరెస్ట్‌ చేసి హాస్టల్‌కు సీల్‌ వేశారు. తిరువణ్ణామలై ఎంకేవీ వీధిలో నందకుమార్‌కు సొంతమైన ప్రయివేటు చిన్నారుల హాస్టల్‌ నడుస్తుంది. వీటిలో మేనేజర్‌గా వినోద్‌కుమార్‌ పనిచేస్తున్నాడు. ఈ హాస్టల్‌లో 17 సంవత్సరాలలోపు 15 మంది బాలికలు ఉంటున్నారు. ఈ హాస్టల్‌ను అనుమతి లేకుండా నడుపడంతో పాటు బాలికలకు లైంగిక వేధింపులు ఇస్తున్నట్లు కలెక్టర్‌ కందస్వామికి రహస్య సమాచారం అందింది. దీంతో మంగళవారం రాత్రి కలెక్టర్‌ కందస్వామి, ఎస్పీ సిబి చక్రవర్తి వెళ్లి విచారణ జరిపారు. ఆ సమయంలో బాలికలకు ఎటువంటి రక్షణ లేకుండా హాస్టల్‌ నడుపుతున్నట్లు గుర్తించి వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

దీంతో అధికారులు, పోలీసులు రాత్రి సమయంలో హాస్టల్‌ గదిలో తనిఖీ చేయగా దాచి ఉంచిన రెండు కంప్యూటర్‌లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకొని పరిశీలించారు. వాటిలో వందల సంఖ్యలో ఉన్న అసభ్య వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం బాలికల వద్ద విచారణ జరపగా హాస్టల్‌ నిర్వాహకులు తరచూ బాలికలకు లైంగికంగా వేధింపులు చేయడంతో పాటు సమయానికి భోజనం పెట్టకుండా పస్తులు పెడుతున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు హాస్టల్‌కు సీల్‌ వేసి అందులో ఉన్న కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. హాస్టల్‌ యజమాని నందకుమార్‌ పరారీలో ఉండడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీంతో రాత్రి వార్డెన్, వంట మనిషిని అరెస్ట్‌ చేశారు. అనంతరం హాస్టల్‌లో ఉన్న 15 మంది బాలికలను పెరుంబాక్కం గ్రామంలో ఉన్న ప్రభుత్వ హాస్టల్‌లో ఉంచి విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు