జిల్లాలో పెరుగుతున్న లైంగిక దాడులు
పిల్లల్ని జాగృతి చేసే ప్రభుత్వ శాఖలేవీ
వరుస ఘటనలతో తల్లిదండ్రుల్లో కలవరం
చిత్తూరు అర్బన్: సభ్య సమాజం ఏ మాత్రం జీర్ణించుకోలేని ఇలాంటి ఘటనలు ఇటీవల జిల్లాలో ఎక్కువవుతున్నాయి. అందులోనూ చిన్న పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులను నివారించడంలో ఎలాంటి శాశ్వత పరిష్కారం కనిపించడంలేదు. చట్టాల్లో ఎన్ని మార్పులు చేస్తున్నా, శిక్షలు కఠినతరం చేస్తున్నా ప్రయోజనం లేదు. గ్రామాల్లోని ప్రజలకు వీటిపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఇలాంటి ఘటనలు పునరావృతానికి కారణంగా తెలుస్తోంది.
తల్లిదండ్రులదే బాధ్యత
ఆడ పిల్లల్ని కంటి రెప్పలా కాపాడుకుంటున్నాం. అయినా సరే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయంటూ చాలామంది తల్లిదండ్రులు వాపోతుంటారు. వాస్తవంగా పిల్లలకు చిన్నప్పటి నుంచే లైంగిక అఘాయిత్యాలపై కనీస అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఎవరైనా ఇబ్బందికి గురిచేస్తే ధైర్యంగా పెద్దలకు చెప్పాలనే ధీమా కల్పించాలి. కళాశాలల్లో చదివే యువతులకు సోషల్ మీడియా వల్ల కలిగే దుష్పరిణామాలు, ఇబ్బందుల్ని వివరంచాలి. అప్పుడే ఆడ పిల్లల్లో మానసిక వికాసం కలుగుతుంది.
కౌన్సెలింగ్ అవసరం
చిన్నపిల్లలు, మహిళలపై లైంగిక దాడులను నివారించే బాధ్యత ఏ ఒక్కశాఖకో పరిమితమం కాదు. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుల నుంచి ఇంట్లో తల్లిదండ్రులు, మాతా శిశు సంరక్షణ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖలతోపాటు జిల్లా న్యాయ సేవాధికార సంస్థపైనే ప్రధాన బాధ్యత ఉంది. ముఖ్యంగా నిరక్షరాస్యత ఉన్న గ్రామాల్లో లైంగికదాడులపై ప్రజల్ని చైతన్యం చేయాలి. చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి.
చట్టాలు కఠినం..
పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టడానికి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫర్ సెక్సువల్ అఫెన్స్ (పోక్సో) యాక్టు –2012 కింద పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయొచ్చు. ఇంట్లోని కుటుంబ సభ్యులు, సమాజంలోని వ్యక్తులు మైనర్ బాలికలపై లైంగిక చర్యలకు పాల్పడితే ఈ యాక్టు కింద కేసు పెట్టొచ్చు. సాక్ష్యాలు నిరూపితమైతే న్యాయస్థానం నిందితులకు కనిష్టంగా ఏడాది నుంచి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధించొచ్చని చట్టం చెబుతోంది.