నవ వధువుపై గ్యాంగ్‌రేప్‌

30 Sep, 2018 04:58 IST|Sakshi

భర్త కుటుంబీకులు, తాంత్రికుడి అఘాయిత్యం

హరియాణాలో ఘటన

కురుక్షేత్ర: ఓ నవవధువుకు మత్తుమందు ఇచ్చిన అత్తారింటివారు.. ఆమెపై ఓ తాంత్రికుడితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ‘మీ కుమార్తె మానసికస్థితి సరిగ్గా లేదు’ అంటూ అమ్మాయి తండ్రికి సమాచారం అందించారు. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన హరియాణాలోని యమునానగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. యమునానగర్‌ పట్టణంలో ఉంటున్న ఓ యువకుడికి కురుక్షేత్రకు చెందిన యువతితో ఈ నెల 12న వివాహమైంది. ఆమె అత్తారింటిలో అడుగుపెట్టగానే ఓ తాంత్రికుడిని కుటుంబ సభ్యులు రప్పించారు. అనంతరం యువతిచేత ఓ ద్రవాన్ని తాగించారు.

ఆమె స్పృహ కోల్పోగానే భర్త అన్నయ్యతో పాటు ఆడపడుచు భర్త అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత 3 రోజుల పాటు ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహించిన తాంత్రికుడు.. కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడు. అనంతరం ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమె దుస్తులను తగలబెట్టారు. తనపై జరిగిన దారుణాన్ని కుమార్తె తండ్రికి చెప్పడంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. ఈ కుట్రలో పెళ్లికుమారుడి తల్లి, చెల్లెలు కూడా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో తొలుత జీరో ఎఫ్‌ఐఆర్‌(బదిలీ చేయగలిగే ఎఫ్‌ఐఆర్‌)ను నమోదుచేసిన కురుక్షేత్ర పోలీసులు.. యమునానగర్‌ పోలీస్‌స్టేషన్‌కు దాన్ని బదిలీచేశారు. 

మరిన్ని వార్తలు