ఘోరం: ఆమెను కొట్టి చంపేశారు!

18 Jan, 2020 08:36 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. లైంగిక దాడి బాధితురాలి తల్లిని నిందితులు కొట్టి చంపేశారు. కేసు వాపసు తీసుకునేందుకు ఆమె నిరాకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. వివరాలు... యూపీలోని కాన్పూర్‌కు చెందిన ఓ బాలిక(13)పై అబిద్‌, మింటు, మెహబూబ్‌, చాంద్‌ బాబు, జమీల్‌, ఫిరోజ్‌ అనే వ్యక్తులు గతేడాది లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో బాలిక కుటుంబ సభ్యులు ఆ ఆరుగురిపై పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. దీంతో వారు అరెస్టయ్యారు.

కాగా ఇటీవల బెయిలుపై విడుదలైన నిందితులు గత గురువారం బాధితురాలి ఇంటికి వెళ్లారు. కేసు వాపసు తీసుకోవాలంటూ బాలిక, ఆమె తల్లిని బెదిరించారు. అయితే వాళ్లు అందుకు నిరాకరించడంతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాలిక తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితుల్లో ఒకడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మిగతావారిని సైతం అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు.  
 

మరిన్ని వార్తలు