అమ్మా, నాన్నా.. అక్కడకొచ్చి నా శవం తీసుకెళ్లండి..!!

4 Jul, 2019 10:52 IST|Sakshi

వాట్సాప్‌లో తనయుడి ఫోన్‌ నుంచి చివరి సందేశం

ఐటీఓ బ్రిడ్జి వద్ద శవం ఉంటుందని మెసేజ్‌

డెలివరీ బాయ్‌ అనుమానాస్పద మృతి

న్యూఢిల్లీ : స్నేహితులతో కలిసి బర్త్‌డే పార్టీకి వెళ్లిన కొడుకు అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. మరికాపట్లో ఇళ్లు చేరుతానని చెప్పిన తమ కుమారుడు హర్ష్‌ కందేల్వాల్‌ (26) నుంచి ఊహించని మెసేజ్‌ రావడంతో ఆ తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు.  ‘అమ్మా నాన్నా నన్ను క్షమించండి. నా స్కూటర్‌, మనీ పర్స్‌, ఇతర వస్తువులు ఐటీవో బ్రిడ్జి దగ్గర ఉంటాయి తీసుకోండి. నా శవం బ్రిడ్జి కింద ఉంటుంది స్వాధీనం చేసుకోండి’అని వాట్సాప్‌లో సందేశమిచ్చాడు. 

ఊహించని షాక్‌తో తల్లిదండ్రులు హుటాహుటిన ఐటీవో బ్రిడ్జి దగ్గరకు చేరుకున్నారు. అతను చెప్పినట్టే అక్కడ స్కూటర్‌, పర్స్‌ ఉన్నాయి. కానీ, హర్ష్‌ కనబడలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్‌ కేసు పెట్టారు. వాట్సాప్‌ మెసేజ్‌ గురించి తెలుసుకున్న పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. వట్టి బెదిరింపులే కావచ్చునని అనుకున్నారు. అయితే, జూన్‌ 30న నుంచి కనిపించకుండా పోయిన హర్ష్‌ యమునా నది తీరంలో జూలై 3న శవమై తేలాడు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌ సేకరించేవారు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. 

ఆ శవం నాలుగు రోజుల క్రితం కనిపించకుండాపోయన హర్ష్‌దే అని గుర్తించారు. నలుగురు స్నేహితులతో కలిసి ఫ్రెండ్‌ భార్య పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన తమ కొడుకు హత్యకు గురయ్యాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి చాందినీచౌక్‌లో నివాసముండే హర్ష్‌ ఓ ఆన్‌లైన్‌ కంపెనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. హత్యేకేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. 

మరిన్ని వార్తలు