‘మీ సేవ’లో మనీ ట్రాన్స్‌ఫర్‌ మోసం 

5 Apr, 2018 09:18 IST|Sakshi
పోలీసులతో మాట్లాడుతున్న బాధితురాలు

డబ్బును ట్రాన్స్‌ఫర్‌  చేయకుండా దుర్భాషలు 

నీ దిక్కున్నచోట చెప్పుకో..  అంటూ బెదిరింపులు

ఆత్మహత్య చేసుకుంటానన్న  బాధితురాలు

పోలీసుల రంగ ప్రవేశంతో డబ్బు ఇస్తామన్న నిర్వాహకులు

మెదక్‌ మున్సిపాలిటీ: ‘మా తమ్ముడి కొడుకు ఆస్పత్రిలో ఉన్నాడని, అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని ఇచ్చిన డబ్బులు అకౌంట్‌లోకి రాలేదని అడిగితే’ మీ సేవ నిర్వాహకులు నానా దుర్భాషలాడుతున్నారని  ఓ మహిళ మీ సేవ ముందు రోధించింది. ఈ సంఘటన బుధవారం మెదక్‌ పట్టణంలో చోటు చేసుకుంది. బాధితురాలి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన వనం పద్మ, తమ్ముడి కొడుకు  అనారోగ్యంతో ఉండటంతో నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు.

అయితే ఆమె ఆçస్పత్రి ఖర్చుల కోసం డబ్బులను పంపించేందుకు మార్చి 31న పట్టణంలోని జీకేఆర్‌ గార్డెన్‌ ప్రాంతంలో మీసేవ సెంటర్‌కు వెళ్లింది. రూ.10వేలు నిర్వాహకులకు అప్పగించి తన తమ్ముడి ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేయాలని చెప్పింది. దీంతో డబ్బులు తీసుకున్న నిర్వాహకులు డబ్బులు పంపించామని పద్మకు చెప్పి, అందుకు సంబంధించిన రషీదు కూడా ఇచ్చారు. అయితే ఏప్రిల్‌ 4వ తేదీ ఖాతాలోకి డబ్బులు రాలేదు. ఈ విషయమై బాధితురాలు బుధవారం మీసేవ నిర్వాహకులను ప్రశ్నించింది.

నిర్వాహకులు మాత్రం ‘గోల చేయకు ఖాతాలోకి డబ్బులోస్తాయని వెళ్లిపోమ్మంటూ’ గద్దించారు. దీంతో ఆగ్రహించిన ‘డబ్బులు ఇచ్చి వారం రోజులవుతున్నా..  ఇప్పటికీ కూడా డబ్బులు రాలేదంటే’ గద్దిస్తారా? అంటూ నిలదీసింది. దీంతో మీ సేవ నిర్వాహకులు నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ మహిళ అని చూడకుండా దుర్భాషలాడరని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. నా డబ్బులు నాకు ఇవ్వకుంటే ఇక్కడే పురుగుల మందు తాగి చచ్చిపోతానంటూ మీ సేవ ముందు బైఠాయించి రోధించింది.

అయినప్పటికీ నిర్వాహకులు నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఈక్రమంలో అక్కడికిచేరుకున్న పోలీసులు బాధితురాలి ఆవేదన విని వెంటనే ఆమె డబ్బులు ఇవ్వాలని మీసేవ నిర్వాహకులను హెచ్చరించారు. అయినప్పటికీ వారు మాత్రం బ్యాంకులోకి సెలవులు ఉండటంతో డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ కావడంలో ఆలస్యమైందని తెలిపారు.

పోలీసుల సూచన మేరకు బాధితురాలికి డబ్బులు ఇస్తామని తెలిపారు.  అధికారుల పర్యవేక్షణ లోపంతో మీసేవ సెంటర్ల నిర్వాహకులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. సెంటర్లకు వచ్చిన ప్రజలపై దురుసుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు.     

మరిన్ని వార్తలు