నార్సింగిలో తల్లి, కొడుకుల కిడ్నాప్‌ కలకలం

8 Jul, 2020 19:55 IST|Sakshi

సాక్షి, నార్సింగి : నార్సింగి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తల్లి, కొడుకు కిడ్నాప్‌ గురి కావడం కలకలం రేపింది. వివరాలు.. బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలోని గంధంగూడకు చెందిన 37 ఏళ్ల ఆదిలక్ష్మి నాంపల్లి కోర్టులో విధులు నిర్వహిస్తున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ఆదిలక్ష్మి కొన్ని రోజులుగా గంధంగూడలోని అభయ ఆంజనేయ దేవాలయం గుడిలో ప్రదర్శనలు చేస్తున్నారు. బుధవారం కూడా ఆంజనేయ దేవాలయంలో ప్రదర్శనలు చేయడానికి తన కుమారుడు ప్రజ్వన్‌ను వెంటబెట్టుకొని వచ్చింది. ప్రదర్శన చేస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు  ఆదిలక్ష్మి, ప్రజ్వన్‌లను కిడ్నాప్‌ చేసినట్లు తెలిసింది.

ఆ వ్యక్తులు వారి వెంట తెచ్చుకున్న ఎక్స్‌యూవీ 500 కారులో తల్లి, కొడుకును బలవంతంగా ఎక్కించుకోవడం ఆలయ పూజారి గమనించారు.వెంటనే ఈ విషయాన్ని నార్సింగి పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలికి చేరుకున్నారు. పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  కాగా ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి రోజు 11 ప్రదక్షిణలు చేయడానికి ఆదిలక్ష్మి వస్తుందని పూజారి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు