తల్లీ కూతుళ్ల ఆత్మహత్య

21 Oct, 2019 02:47 IST|Sakshi

కూతురి మరణం తట్టుకోలేక తల్లి కూడా..

వీరి అంత్యక్రియలకు వస్తుండగా ఆటో ప్రమాదంలో చిన్నారి మృతి

సంగారెడ్డి రూరల్‌: ఆర్థిక సమస్యలతో తల్లీ కూతుళ్లు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం చెర్లగూడెంలో చోటుచేసుకుంది. చెర్లగూడెంలో ఉంటున్న అలకుంట గంగమ్మ (70), మాశెట్టి నాగమ్మ (40) తల్లీ కూతుళ్లు. గంగమ్మ, నాగమ్మ భర్తలు గతంలోనే మృతి చెందారు. గంగమ్మకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉండగా..నాగమ్మకు ఓ కుమార్తె ఉంది.నాగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకు సరిపడా డబ్బులు లేకపోవడంతో మనస్తాపం చెంది చనిపోతానని తరచూ చెబుతుండేది.ఈ క్రమంలో నాగమ్మ శనివారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురి మరణాన్ని తట్టుకోలేక తల్లి గంగమ్మ కూడా అదేరోజు అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

అంత్యక్రియలకు వస్తుండగా ఆటో బోల్తా.. 
శనివారం ఆత్మహత్య చేసుకున్న గంగమ్మ, నాగమ్మ ల అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నర్సాపూర్‌ నుంచి వస్తున్న బంధువుల ఆటో బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి మృతిచెందగా.. మరో 11 మంది గాయపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేటలో చోటుచేసుకుంది. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నర్సాపూర్‌ నుంచి మహేశ్‌ తన కుటుంబ సభ్యులతో ఆటోలో బయలుదేరారు. ఆటో ఇస్మాయిల్‌ఖాన్‌పేటకు రాగానే అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో బోల్తా పడింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న చిన్నారి దుర్గ (8) అక్కడికక్కడే మృతి చెందింది. పాప తల్లి కనకమ్మ, మాశెట్టి రాధమ్మలకు తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు