క్షుద్ర పూజలు చేస్తున్నారని తల్లీకూతుళ్లను..

30 Jun, 2019 17:48 IST|Sakshi

రాంచీ : క్షుద్రపూజలు చేస్తున్నారనే నెపంతో తల్లీకూతుళ్లను విచక్షణా రహితంగా చితకబాది, ఆపై కత్తితో నరికి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్‌ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు.. సింగ్‌భూమ్‌ జిల్లాలోని రోవాఓలి గ్రామానికి చెందిన సుభాష్‌ ఖాన్‌దైత్‌ తన ఇంట్లో ఓ పూజ నిర్వహించాడు. ఈ పూజకు పక్కింటి రామ్‌బిలాస్ అనే వ్యక్తి భార్య హాజరయ్యింది. అయితే పూజ అనంతరం ఇంటికి చేరుకున్న ఆమె అనారోగ్యం పాలైంది.

దీంతో తన భార్య సుభాష్‌ నిర్వహించిన క్షుద్రపూజల కారణంగానే అనారోగ్యం పాలైందని భావించిన రామ్‌బిలాస్‌.. కుటుంబసభ్యులతో కలిసి సుభాష్‌ ఇంటిపై దాడికి దిగాడు. ఈ నేపథ్యంలో సుభాష్‌ తన ఇద్దరు కుమారులతో ఇంట్లో నుంచి తప్పించుకోగా అక్కడే చిక్కుకుపోయిన అతడి భార్య, కూతురిపై రామ్‌ బిలాస్‌, అతడి కుటుంబసభ్యులు దాడి చేశారు. తల్లీకూతుళ్లను విచక్షణా రహితంగా చితకబాది, కత్తితో నరికి చంపేశారు. దాడి నుంచి తప్పించుకున్న సుభాష్‌ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు