రోడ్డు ప్రమాదంలో తల్లీ తనయుడి మృతి
పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు వెళ్తుండగా ప్రమాదం
సాక్షి, తుమకూరు: కుమారుడి పెళ్లి పత్రికలను బంధువులకు ఇచ్చేందుకు పయనమైన తల్లీ తనయుడిని మృత్యువు కాటేసింది. మరికొద్ది రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువకుడిని విధి కాటికి తరలించింది. ఈ విషాద ఘటన జిల్లాలోని మధుగిరి తాలూకా, మిడిగేశి పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. తాలూకాలోని మాడగానహట్టి గ్రామానికి చెందిన కంబక్క(48)కుమారుడు మంజునాథ్(26) పడసాలహట్టికి చెందిన యువతితో వివాహం నిశ్చచమైంది.
ఈ నెల 22న పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో బంధువులకు ఆహ్వాన పత్రికలు ఇచ్చేందుకు కంబక్క, మంజునాథ్లు బుధవారం బైక్పై బయల్దేరారు. మధుగిరి– పావగడ మధ్యలో కేశిప్ రోడ్డులో పడసాలహట్టి బస్టాండు సమీపంలో వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొంది. ప్రమాదంలో కంబక్క అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మంజునాథ్ను ఆస్పత్రకి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మిడిగేశి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.