జియాగూడ: కుటుంబ కలహాల కారణంగా తల్లీకొడుకులను దారుణంగా హత్యచేసిన సంఘటన కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. కుల్సుంపురా ఇన్స్పెక్టర్ శంకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జియాగూడ, సాయిదుర్గానగర్కు చెందిన సుందర్రాజ్ గుల్జార్ హౌజ్ ప్రాంతంలో బంగారం దుకాణాల వద్ద మట్టిని ఊడ్చి బంగారాన్ని జల్లెడపట్టే పని చేసేవాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య జగదీశ్వరీకి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె, రెండో భార్య వనేశ్వరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
కొద్ది రోజుల కిత్రం పెద్ద భార్య కుమారుడు మోహన్కు పెళ్లి సంబంధం మాట్లాడేందుకు వెళ్లగా అమ్మాయి తరపువారు పిల్లను ఇచ్చేందుకు నిరాకరించారు. ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతున్న మోహన్ ఇటీవల గుల్జార్ హౌస్లో బంగారం ఏరివేత పని చేస్తున్న వనేశ్వరీ, నట్రాజ్ వద్దకు వెళ్లడంతో వారు అతడిపై రాయితో దాడిచేశాడు. దీనిని మనుసులో పెట్టుకున్న మోహన్ సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నమ్మ వనేశ్వరి(50), నట్రాజ్(24)లపై దాడిచేసి హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.