మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య

2 Nov, 2017 11:48 IST|Sakshi
శ్రీదేవి మృతదేహం

మర్లపాలెం(గన్నవరం): కుమార్తె ప్రేమ వ్యవహారం విషయమై మనస్తాపానికి గురైన తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గన్నవరం శివారు మర్లపాలెంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మర్లపాలెం గ్రామానికి చెందిన చెరుకు జయబాబు ప్రైవేట్‌ బస్సు క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య శ్రీదేవి (35) ఇంటి వద్ద  టైలరింగ్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. వీరి కుమారై లావణ్య ఇంటర్మీడియట్‌ చదువుతోంది. శ్రీదేవి మేనల్లుడైన తెనాలికి చెందిన ధర్మసాయికి, లావణ్యకు మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహరం నడుస్తోంది. రెండు వారాల క్రితం జయబాబు డ్యూటీ నిమిత్తం వెళ్లగా ఇంటి వద్ద శ్రీదేవి, కుమారై మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం లావణ్య పుట్టిన రోజు కావడంతో ఆమెను తెనాలి తీసుకువెళ్లేందుకు ధర్మసాయి ఇంటికి వచ్చాడు. దీనికి శ్రీదేవి నిరాకరించింది.

ధర్మసాయి ఆమెతో గొడవపడి బలవంతంగా లావణ్యను తీసుకువెళ్లాడు. అయితే మేనల్లుడితో కుమారై ప్రేమ వ్యవహారాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న భర్త జయబాబుకు ఈ విషయం తెలిస్తే మందలిస్తాడనే భయాందోళనకు శ్రీదేవి గురైంది. దీనికితోడు కుమారైకు చెప్పినప్పటికి వినకుండా మేనల్లుడితో వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంటిలో సీలింగ్‌ రాడ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి మనుమరాలు జన్మదినం కోసం వీరపనేనిగూడెం వచ్చిన శ్రీదేవి తల్లి ఉరికి వేలాడుతున్న కుమార్తెను చూసి నిశ్చేష్టురాలైంది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది ఆమెను పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సీఐ కె. శ్రీధర్‌కుమార్‌ నేతృత్వంలో సిబ్బంది విచారణ చేపట్టారు. మృతురాలు చేతిపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు