ఆ తల్లికి ఏకష్టమొచ్చిందో?

28 Jan, 2019 12:08 IST|Sakshi
మంచంపై అచేతనంగా పడి ఉన్న చిన్నారులు, ఇంటి ముందు గుమికూడిన స్థానికులు

ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి తానూ బలవన్మరణం

చిక్కలో విషాదం

చిక్కబళ్లాపురం : ఆ తల్లికి ఏమి కష్టమొచ్చిందో.. తన ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి తానూ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం నగరంలోని విశ్వశ్వరయ్య లేఔట్‌లో జరిగింది. వివరాలు... లేఔట్‌లో అశ్వత్థనారాయణ, ఉషా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి శమంత్‌ (8), శాన్వి (6) కుమార్తెలు ఉన్నా రు. అశ్వత్థనారాయణ ఇక్కడి దిబ్బూరు ప్రభుత్వ పాఠశాలలో పీటీ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి ఇంటిలో అందరూ సంతోషంగా భోజనాలు కూడా చేశారు. ఆదివారం ఉదయం భర్త అశ్వత్థ నారాయణ అబ్లోడులో ఉన్న పొలం పనులను పర్యవేక్షించడానికి వెళ్లాడు. భర్త వెళ్లిన తరువాత ఉషా (30) తన ఇద్దరు బిడ్డలకు విషమిచ్చి అనంతరం తానూ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఉదయం 9 గంటలకు అశ్వత్థ నారాయణ భార్య సెల్‌కు ఫోన్‌ చేశాడు. స్పందన లేకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా అందరూ అచేతనంగా పడి ఉన్నారు. స్థానికులకు విషయం తెలిపి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి డెత్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌పీ కార్తీక్‌ రెడ్డి, డీఎస్‌పీ ప్రభుశంకర్‌ సంఘటన  స్థలాన్ని పరిశీలించారు. అశ్వత్థ నారాయణను విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.విషయం తెలుసుకున్న ఉషా బంధువులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. ఉషా ఎందుకు ఇంత దారుణానికి పాల్పడిందో.. కుటుంబంలో ఏమైనా కలహాలు ఉన్నాయా అనే దానిపై కూడా  పోలీసులు  దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు