జీవితంపై విరక్తి చెందాం 

13 Aug, 2019 08:09 IST|Sakshi

ఇద్దరు కుమార్తెల సహా మహిళ ఆత్మహత్య 

ప్రాణాలు తీసిన భర్త వివాహేతర సంబంధం 

బెంగళూరు : భర్త వివాహేతర సంబంధంతో తీవ్ర మనస్థాపానికి గురైన భార్య తన  ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమంతనగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... మండ్యకు చెందిన సిద్దయ్య, రాజేశ్వరి (40) దంపతులకు మానస (17), భూమిక (15) కుమార్తెలు ఉన్నారు. వీరు ఇక్క డి  శ్రీనగర కాళప్పలేఔట్‌ కేంబ్రిడ్జ్‌ స్కూల్‌ సమీపంలో నివాసముంటున్నారు. సిద్దయ్య కేఈబీ లో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహించేవాడు. రాజేశ్వరి గృహిణి కాగా కుమార్తెలు మానస ప్రథమ పీయూసీ చదువుతుండగా, భూమిక ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదువుతోంది.  సిద్దయ్య మూడేళ్లుగా ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుడంటంతో  భార్య పిల్లలను నిర్లక్ష్యం చేశాడు. పలుమార్లు కుటుంబ పెద్దలతో రాజీ చేసి సిద్దయ్య ప్రవర్తన మార్పురాలేదు. ఇటీవల సిద్ధయ్య ఇంటికి రావడం కూడా తగ్గించడంతో భార్య రాజేశ్వరి ఇద్దరు పిల్లలు తీవ్ర మనస్ధాపానికి గురయ్యారు.

విధుల నిమిత్తం సిద్దయ్య వేరే ప్రాంతానికి వెళ్లడంతో ఆదివారం రాత్రి రాజేశ్వరి, ఇద్దరు కుమార్తెలు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం ఉదయం ఎంతసేపటికి ఇంటి తలుపు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారు స్థానికులు సాయంతో తలుపు బద్దలుకొట్టి గదిలో చూడగా ముగ్గురు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాలను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు ముందు రాజేశ్వరి తన వాట్సాప్‌ చివరి స్టేటస్‌లో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డామని తన చావుకు సిద్దయ్య, అతని ప్రియురాలే కారణమని తెలిపింది.   


వాట్సాప్‌ చివరి స్టేటస్‌

మరిన్ని వార్తలు