వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని..

20 Jun, 2019 06:53 IST|Sakshi
హేమశ్రీ, శ్రీప్రియ వీపులపై వాతలు తలపై గాయం చూపిస్తున్న శ్రీప్రియ , హేమశ్రీ, ముఖం, చేతులపై గాయాలతో అక్కాచెల్లెళ్లు

వద్దమ్మా..కాల్చొద్దమ్మా.. ప్లీజ్‌ అమ్మా..కొట్టకే..నొప్పెడుతోందమ్మా అంటూ ఆ బిడ్డలు ఎంత తల్లడిల్లారో ఎంతగా..వెక్కివెక్కి ఏడ్చారో పాపం వీపంతా వాతల మయంచెంపలు, మోచేతులు చర్మం ఊడి..గాయాలైన ఆ చిన్నారులు..ఆ పసికూనలు బిక్కుబిక్కు మంటున్నారు. కన్నతల్లి అనైతిక చేష్టలతో రోజూ నరకం చూసి కదిలిస్తే..బోరున విలపిస్తున్నారు.  
  
కొత్తగూడెంఅర్బన్‌:
నవ మాసాలు మోసిన కన్న తల్లే కూతుళ్ల పట్ల కాసాయిలా మారింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే సాకుతో చిన్నారులను చిత్రహింలకు గురి చేసింది. ఈ విషయం ఆమె సోదరుడికి(పిల్లల మేనమామ) తెలియడంతో నిర్వాకం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించి కొత్తగూడెం టూటౌన్‌ ఎస్సై కుమారస్వామి తెలిపిన వివరాలిలా..కొత్తగూడెం పట్టణంలోని బొగ్గు గని ప్రాంతమైన రుద్రంపూర్‌కు చెందిన గౌడ్స్‌ ఓం ప్రకాశ్‌ మూడు నెలల క్రితం మృతి చెందాడు. అతడి భార్య రూప, కూతుళ్లయిన 8 సంవత్సరాల హేమశ్రీ, ఐదేళ్ల శ్రీప్రియ ఉన్నారు. రూపకు అప్పటికే గౌతంపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ రాజేష్‌తో వివాహేతర సంబంధం ఉంది.

అయితే భర్త చనిపోయిన తర్వాత వీరిరువురి బంధం బలపడింది. ఈ క్రమంలో కూతుళ్లు హేమశ్రీ, శ్రీప్రియ అడ్డుగా ఉన్నారనే కారణంతో రూప వారిని ప్రతిరోజూ చిత్రహింసలకు గురి చేస్తోంది. ఒళ్లంతా వాతలు పెట్టింది. ముఖంపైనా తీవ్రంగా గాయపర్చింది. చిన్నారుల ఒళ్లంతా గాయాలే కనిపించడంతో  ఈ విషయం రూప సోదరుడు ఉర్సు కుమార్‌కు తెలిసింది. కుమార్‌ బుధవారం రూప ఇంటికి వెళ్లి పిల్లలను ఆరా తీయగా నిజం బయటపడింది. చిన్నారులు జరిగిన విషయమంతా వివరించారు. దీంతో కుమార్‌ ఇద్దరు పిల్లలను తీసుకుని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై కుమారస్వామి రూపను స్టేషన్‌కు పిలిపించి విచారించగా తన కూతుళ్లను గాయపర్చింది, చిత్రహింసల పాలు చేసింది నిజమేనని అంగీకరించింది. ఆమెపై ఎస్సై కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు