చావడానికి దూకితే...

25 Jun, 2018 08:58 IST|Sakshi

వ్యక్తిగత కారణాలు ఆమెను మానసికంగా కుంగదీశాయి. నెలలు కూడా నిండని పసికందుతోసహా ఆత్మాహూతికి సిద్ధపడింది. అమాంతం రైలు పట్టాలపై దూకేసింది. జనాలు చూస్తుండగానే రైలు వాళ్ల మీదినుంచి పోయింది. కానీ, అదృష్టవశాత్తూ ఆ రెండు ప్రాణాలు నిలిచాయి. 

భోపాల్‌: శనివారం ఉదయం ఓ మహిళ, ఓ చంటి బిడ్డతో భూర్హన్‌పూర్‌ జిల్లాలోని నేపానగర్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. పుష్కక్‌ ఎక్స్‌ప్రెస్‌ స్టేషన్‌కు వస్తున్న సమయంలో అమాంతం పట్టాలపైకి దూకింది. జనాలంతా అరుస్తుండగానే రైలు వాళ్ల మీదునుంచి వెళ్లింది. అయితే చిన్న గాయం కూడా కాకుండా ఆ తల్లికూతుళ్లు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ట్రాక్‌కు సరిగ్గా మధ్యలో పడిపోవటంతో రైలు వారి మీదుగా వెళ్లింది. షాక్‌లోకి వెళ్లిన మహిళను సమీపంలోని ఆస్పత్రికి ప్రయాణికులు తరలించారు. రంగంలోకి దిగిన ఆర్‌పీఎఫ్‌ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 

తన పేరు తబాస్సుమ్‌ అని, భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నానని, ఎటు వెళ్లాలో తెలీని స్థితిలో బిడ్డతో కలిసి చనిపోయేందుకు నిర్ణయించుకున్నానని వివరించింది. దీంతో ఆమెకు కౌన్సిలింగ్‌ ఇచ్చిన పోలీసులు సఖి సెంటర్‌కు తరలించి, ముంబైలోని ఆమె బంధువులకు సమాచారం అందించారు.   

మరిన్ని వార్తలు