పని చేసుకోవాలని చెప్పినందుకు కోపం పెంచుకున్న కొడుకు
తలపై రాయితో మోది హత్య
నవాబుపేట (జడ్చర్ల) మహబూబ్నగర్ : నవమాసాలు మేసి పెంచిçన తల్లి.. తన కొడుకు ఎదగాలని కోరుకుంటే చెడుతిరుగుళ్లతో కాలం గడపడం చూసి తట్టుకోలేకపోయింది.. ఏదైనా పని చేసుకోవాలంటూ సూచించింది.. దీనిని తట్టుకోలేని ఆ కొడుకు తల్లి తలపై రాయితో మోది హత్య చేశాడు. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మం డలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నవాబు పేట మండలం గురుకుంట పంచాయతీ పరిధిలో దరిపల్లి గ్రామంలో ఆంజనేయులు–రాజేశ్వరి దంపతులు నివస్తున్నారు.
వీరికి ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు పెయింటింగ్ పని చేస్తుండగా, చిన్న కుమారుడు శ్రీహరి ఇంటి వద్దే ఉంటున్నాడు. కొన్నాళ్లు హైదరాబాద్లో పనిచేసిన వచ్చిన ఆయన ఇప్పుడు స్థానికంగానే ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ విషయమై స్థానికులు పలువురు శ్రీహరిని మందలించారు. దీంతో అవమానంగా భావించిన రాజేశ్వరి.. గ్రామంలో పరువు పోతోందని, ఏదైనా పని చేసుకోవాలంటూ కుమారుడు శ్రీహరికి సోమవారం రాత్రి నచ్చచెప్పింది.
ఆ వెంటనే రూ.60 అడగగా ఆమె ఇవ్వలేదు. దీంతో సోమవారం రాత్రి ఇంటి నుండి వెళ్లిపోయిన శ్రీహరి తల్లి ఆరుబయట నిద్రకు ఉపక్రమించిన తర్వాత వచ్చి రాయితో తలపై మోది హత్య చేసినట్లు తెలిసింది. మంగళవారం తెల్లవారు జామున రాజేశ్వరిని ఆమె భర్త నిద్రలేపేందుకు యత్నించగా తలపై రక్తపు మరకలు ఉండడం, ఆమె ఎంతకూ మేల్కొనకపోవడంతో ఆస్పత్రికి తరలించారు.
అయితే, అప్పటికే రాజేశ్వరి మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. కాగా, రాజేశ్వరిని చిన్నకుమారుడు శ్రీహరి హత్య చేసినట్లు తండ్రి ఆంజనేయులు అనుమానం వ్యక్తం చేసినా.. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ ఘటనపై గ్రామ కార్యదర్శి రామచంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపారు.