ప్రేమికుడి తల్లిని స్తంభానికి కట్టేసి..

21 Jul, 2019 08:39 IST|Sakshi

చిత్రహింసలు పెట్టిన ప్రియురాలి తండ్రి

టీ.నగర్‌: విరుదాచలం సమీపంలో ప్రేమ వివాహానికి వ్యతిరేకత తెలుపుతూ ప్రియురాలి తండ్రి ప్రేమికుడి తల్లిని శుక్రవారం విద్యుత్‌ స్తంభానికి కట్టి చిత్రహింసలకు గురిచేయడం ఆ ప్రాంతంలో సంచలం రేపింది. కడలూరు జిల్లా విరుదాచలం సమీపంలోని విలాంగట్టూరు గ్రామానికి చెందిన పొన్నుసామి భార్య సెల్వి (45). ఈమె కుమారుడికి అదే ప్రాంతానికి చెందిన బంధువు కొలుంజి (60) కుమార్తెతో ప్రేమ ఏర్పడింది. ఇలావుండగా గత నెల ఇరువురూ ఇల్లు విడిచి పరారైనట్లు సమాచారం. దీంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం ఏర్పడింది. శుక్రవారం సాయంత్రం సెల్వి ఇంటి ముందు నిలుచుని ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కొలుంజి తన కుమార్తెను ఎక్కడ ఉంచారో చెప్పు! అంటూ ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ అక్కడున్న విద్యుత్‌ స్తంభానికి కట్టేసి చిత్రహింసలకు గురిచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సెల్విని రక్షించి విరుదాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. సెల్వి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కొలుంజిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 

మరిన్ని వార్తలు