ప్రియుడిని కుమార్తెకు ఇచ్చి పెళ్లి చేసేందుకు..

12 Sep, 2019 08:34 IST|Sakshi

సాక్షి, చెన్నై : ప్రియుడితో కుమార్తె వివాహం జరిపించేందుకు తల్లి ప్రయత్నించిన సంఘటన పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేసింది. తంజావూరు జిల్లా  తిరువయ్యారు సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  తిరువయ్యారు సమీపంలోని గ్రామానికి చెందిన  చెందిన 19 ఏళ్ల యువతి తంజావూరు ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఒక ఫిర్యాదు చేసింది. అదే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువకుడు తనను ప్రేమించి మోసం చేశాడని అందులో పేర్కొంది. ఇప్పుడు వేరొక యువతిని గురువారం వివాహం చేసుకుంటున్నాడని, ఈ వివాహాన్ని అడ్డుకుని తనతో వివాహం జరిపించాలని కోరారు. ఈ ఫిర్యాదును ఎస్పీ తిరువయ్యారు మహిళా పోలీసు స్టేషన్‌కు పంపి విచారణకు ఉత్తర్వులిచ్చారు. దీంతో పోలీసులు మంగళవారం సాయంత్రం వారిని పిలిపించి విచారణ జరిపారు.

యువతి వెంట ఆమె తల్లి కూడా వచ్చింది. ఈ సమయంలో యువతి హఠాత్తుగా తన ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీన్ని పోలీసులు అడ్డుకుని మందలించారు. ఆ తర్వాత విచారణ చేపట్టారు. విచారణలో ఆ యువకుడు తాను యువతిని ప్రేమించలేదని, అయితే ఆమె తల్లితో సంబంధం ఉందని బాంబు పేల్చాడు. దీంతో పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. ఇదిలా ఉండగా తన ఫిర్యాదు వాపసు తీసుకుంటున్నట్లు తెలిపిన యువతి అక్కడ్నుంచి వెళ్లింది. అనంతరం పోలీసులు యువతి తల్లి(45), యువకడు ఇద్దరిని విచారణ జరపగా సదరు మహిళకు, యువకుడికి వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. తన కుమార్తెను ప్రియుడికి ఇచ్చి చేస్తే తనకు అనుకూలంగా ఉంటుందని తల్లి భావించింది. దీంతో తలలు పట్టుకున్న మహిళా పోలీసులు తల్లికి హితవు చెప్పి పంపారు. ఇలావుండగా గురువారం యువకుడి వివాహం యధావిధిగా జరుగనుంది.

మరిన్ని వార్తలు