ముంబై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్(కోవిడ్-19) లాక్డౌన్ అమల్లో ఉన్న తరుణంలో రోడ్డుపైకి వచ్చిన ఓ వ్యక్తి పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించాడు. తనను ఆపేందుకు ప్రయత్నించిన సదరు అధికారిని బైకుతో ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన దక్షిణ ముంబైలో చోటుచేసుకుంది. ఖాజాబీ షేక్ నయీమ్(42) అనే వ్యక్తి గురువారం వాడిబండర్ గుండా బైక్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడి ప్రవర్తనపై అనుమానం కలిగడంతో ఏఎస్ఐ విజేంద్ర ధూరత్ బండి ఆపాల్సిందిగా సూచించాడు. (కరోనా వైరస్ ; నటుడిపై దాడి)
ఇక అప్పటికే వేగంగా వెళ్తున్న నయీమ్.. బైకును ఆపకుండా విజేంద్రను 50 మీటర్ల వరకు లాక్కెళ్లాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో నయీంను వెంబడించిన పోలీసులు.. అతడిని అరెస్టు చేశారు. సెక్షన్ 353(ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కల్గించడం లేదా గాయపరచడం) కింద కేసు నమోదు చేశారు. ఏఎస్ఐ విజేంద్రను ఆస్పత్రిలో చేర్పించామని.. అతడి ఆరోగ్యం బాగుందని తెలిపారు.