ముంబై: నాగపూర్ మేయర్ సందీప్ జోషికి పెను ప్రమాదం తప్పింది. గుర్తు తెలియని దుండగుల కాల్పుల నుంచి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు... తన పెళ్లిరోజు సందర్భంగా స్నేహితులకు విందు ఇచ్చేందుకు సందీప్ జోషి మంగళవారం నాగ్పూర్లోని ఓ రెస్టారెంటుకు వెళ్లారు. అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ఇంటికి బయల్దేరారు. దాదాపు 10 మంది స్నేహితులు సైతం వివిధ వాహనాల్లో ఆయనను అనుసరించారు.
ఈ క్రమంలో వార్ధా రోడ్డు గుండా ప్రయాణిస్తున్న సమయంలో.. బైకు మీద వచ్చిన ఇద్దరు దుండగులు సందీప్ జోషి కారుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మూడు బుల్లెట్లు కారు అద్దాలను చీల్చాయి. అయితే ఆ సమయంలో డ్రైవరు సీట్లో ఉన్న సందీప్ వెంటనే కారును నిలిపివేసి చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు.
ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ... కారు డ్రైవర్ సీటు, ఆ వెనుక సీటు అద్దాల్లో బుల్లెట్లు దిగాయని పేర్కొన్నారు. అయితే సందీప్ జోషి సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదన్నారు. లేదంటే ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లేదని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. మేయర్ వాహనంపై కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా బీజేపీకి చెందిన సందీప్ జోషికి గతంలో పలు బెదిరింపు లేఖలు వచ్చాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో కొంతమంది వ్యక్తులు ఆయనను చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఇక గత నెలలో ఆయన కారు చోరీకి గురైంది. ఈ కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.