యాంకర్‌కు మత్తుమందు ఇచ్చి లైంగికదాడి

11 May, 2018 08:23 IST|Sakshi
నిందితుడిపై దాడి చేస్తున్న యువతి, నిందితుడు శ్రీశాంత్‌ రెడ్డి (ఇన్‌సెట్‌లో)

ప్రేమ పేరుతో మోసం

నయవంచకుడిపై కేసు

నిందితుడిని చెప్పుతో కొట్టిన బాధితురాలు

సాక్షి, హైదరాబాద్: సినిమాల్లో అవకాశం కల్పిస్తా మని నమ్మించి, ప్రేమిస్తున్నానని పెళ్లి చేఐసుకుంటానని మాయ మాటలు చెప్పి, ఓ సినీ నటి, డబ్బింగ్‌ ఆర్టిస్ట్, యాంకర్‌కు మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడిన జూనియర్‌ ఆర్టిస్టుపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా , మానేపల్లి గ్రామానికి చెందిన కొండా పుల్లారెడ్డి అలియాస్‌ శ్రీశాంత్‌ రెడ్డి శ్రీకృష్ణానగర్‌లో ఉంటూ సినిమా షూటింగ్‌లకు యువతులను సరఫరా చేసే కో–ఆర్డినేటర్‌గానే కాకుండా సినిమాల్లో నటిస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్‌లో నటి, యాంకర్, డబ్బింగ్‌ ఆర్టిస్టుతో అతడికి పరిచయం ఏర్పడింది. గత డిసెంబర్‌ 10న బోరబండలోని ఆమె గదికి వెళ్లిన శ్రీశాంత్‌ ద్రాక్షరసంలో మత్తుమందు కలిపి తాగించాడు.

ఆమె మత్తులోకి జారుకున్న అనంతరం లైంగికదాడికి పాల్పడటమే కాకుండా, బీరువాలో ఉన్న 40 తులాల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల నగదు తీసుకుని పరారయ్యాడు. కొద్దిరోజుల తర్వాత ఆమె నిలదీయగా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత ఎన్నిమార్లు అడిగినా దాటవేస్తుండటంతో బాధితురాలు గురువారం నటి శ్రీరెడ్డిని కలిసి తనకు న్యాయం చేయాలని కోరింది. అదే సమ యంలో శ్రీశాంత్‌ రెడ్డి తనను కొందరు బెదిరిస్తున్నారంటూ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చాడు.

మధ్యాహ్నం శ్రీశాంత్‌ రెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఉన్నట్లు తెలుసుకున్న బాధితురాలు అక్కడికి చేరుకోగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో ఆమెతో పాటు వచ్చిన మరో యువతి చెప్పుతో కొట్టేందుకు యత్నించగా ఉద్రిక్తత నెలకొంది. బాధితురాలి  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని శ్రీశాంత్‌రెడ్డి క్యాస్టింగ్‌ కౌచ్‌కు పాల్పడుతున్నాడని, ఎంతో మంది యువతులను నిర్మాతలు, దర్శకులు, హీరోల వద్దకు పంపాడని ఆరోపించారు. కార్యాలయాలకు యువతులను పిలిపించుకుని వారికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి నగదు, నగలు దొంగిలిస్తున్నాడని తెలిపారు.

మరిన్ని వార్తలు