భోపాల్ : సృష్టిలో అమ్మను మించిన దైవం లేదంటారు. కానీ, మధ్యప్రదేశ్లోని ఓ మహిళ మాత్రం మాతృత్వానికి మచ్చ తెచ్చింది. కొడుకు పుట్టలేదనే ఆగ్రహంతో.. రోజుల పసికందు ప్రాణాలు తీసింది. వివరాలు.. మంజు సింగ్ (26) ఈ నెల 12 (బుధవారం)న ఓ పాపకు జన్మనిచ్చింది. ఆస్పత్రి నుంచి అమా ఖోరియాలోని పుట్టింటికి వచ్చింది. కొడుకు పుట్టలేదనే ‘పిచ్చి’తనంతో పాప తలపై, పొట్టపై కొడవలి పిడితో కొట్టింది.
తీవ్రంగా గాయపడ్డ శిశువును తొలుత షాజాపూర్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఇండోర్లోని ఎంవై ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పాప శనివారం మరణించింది. బాబు పుట్టలేదనే మనస్తాపంతోనే పాపను చంపినట్టు కసాయి తల్లి పోలీసుల ముందు నేరం ఒప్పుకుంది. ఇప్పటికే ఓ పాప ఉందని, రెండోసారి కూడా పాపే పుట్టడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానని చెప్పుకొచ్చింది. నిందితురాలిని అరెస్టు చేసి జైలుకు తరలించామని ఉదయ్సింగ్ అలవా ఇన్స్పెక్టర్ మోహన్ బదోదియా వెల్లడించారు.