ఎంపీటీసీ భర్త దారుణ హత్య

8 Mar, 2018 07:43 IST|Sakshi
హత్యకు గురైన ఎంపీటీసీ భర్త

వ్యక్తిగత కక్షలే కారణమా..?

గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలం కొత్తపల్లి ఎంపీటీసీ బీనవేని చంద్రకళ భర్త దేవయ్యయాదవ్‌ బుధవారం దారుణహత్యకు గురయ్యారు. గ్రామంలోని ఓ ఫంక్షన్‌లో భోజనం చేసి వస్తున్న దేవయ్యను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కత్తితో పొడిచి చంపినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కొత్తపల్లి గ్రామంలో రాజుపేట బస్టాండ్‌ దారిలో సదరు యువకుడు కత్తితో వెంబడించి హత్య చేసినట్లు పేర్కొంటున్నారు.

దేవయ్య శరీరంపై నాలుగైదుచోట్ల కత్తిపోట్లు ఉన్నాయి. దేవయ్య హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమై ఉండవచ్చునని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల డీఎస్పీ వెంకటరమణ, సీఐలు రవీందర్, శ్రీనివాస్‌రావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. హత్య జరిగిన తీరు, హత్యకు గల కారణాలు, నిందితుడి గురించి ఆరా తీస్తున్నారు.

కొత్తపల్లికి చెందిన సందీప్‌రెడ్డి అనే యువకుడు ఈ హత్య చేసినట్లు పోలీసులు, గ్రామస్తులు భావిస్తున్నారు. కాగా, అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో దేవయ్య క్రీయాశీలకంగా పనిచేస్తున్నారు. యాదవ సంఘం మండల అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. దేవయ్యకు తల్లిదండ్రులు సిద్ధిరాములు, నర్సవ్వ, భార్య చంద్రకళ, కుమారులు అన్వేష్, ప్రపుల్‌ ఉన్నారు.   

మరిన్ని వార్తలు